Avinash Reddy Latest News(Andhra Pradesh Today News) : వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారంతో కర్నూలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశ్వభారతి ఆస్పత్రి వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని కర్నూలు ఎస్పీకి సీబీఐ అధికారులు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారని తెలుస్తోంది. ఎస్పీ కార్యాలయం వద్ద పోలీస్ ఫోర్స్ కోసం సీబీఐ అధికారులు వేచిచూస్తున్నారని సమాచారం. అనినాష్ను అరెస్టు చేస్తే ఊరుకునేది లేదని వైసీపీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. విశ్వభారతి ఆసుపత్రి ఎదుట బైఠాయించిన ఆందోళనకు దిగారు.
మరోవైపు ముందుస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బెయిల్ కోసం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందు అవినాష్ న్యాయవాది మెన్షన్ చేశారు. పిటిషన్ తమ ముందుకు విచారణకు రావట్లేదని.. మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో మరో వెకేషన్ బెంచ్ ముందుకు అవినాష్ తరఫు న్యాయవాది వెళ్లారు.
అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్పై విచారించేందుకు సుప్రీం వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మెన్షనింగ్ లిస్టులో ఉంటేనే బెయిల్ పిటిషన్ ను విచారిస్తామని జస్టిస్ అనిరుధ్, జస్టిస్ సంజయ్ కరోల్ల ధర్మాసనం స్పష్టం చేసింది. మెన్షనింగ్ అధికారి ముందుకు వెళ్లాలని ధర్మాసనం సూచించింది. జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు పిటిషన్ విచారణకు రాకూడదని స్పష్టం చేసింది. ఇలా సుప్రీంకోర్టులో చుక్కెదురుకావడంతో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐకు ఉన్న అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి.