Kakinada : మనుషుల్లో ఆవేశం కంట్రోల్ లో ఉండటం లేదు. క్షణికావేశంలో ఎదుట వ్యక్తులపై దాడులకు తెగబడుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసేందుకు వెనుకాడటంలేదు. తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా కాకినాడలోనూ ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆ అధికారి తీవ్రంగా గాయపడ్డారు.
శుక్రవారం ఉదయం కాకినాడలోని దేవాదాయశాఖ కార్యాలయం సమీపంలో అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. చిన్నారావు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాహనాల రికార్డులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో అక్కడ వ్యాన్పై ఓ వ్యక్తి కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు. ఆ వాహనంపై గతంలో ఓ చలానా ఉంది. ఆ జరిమానా కట్టాలని కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తిని అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ చిన్నారావు కోరారు.
చలానా చెల్లించమనటంతో చిన్నారావుతో కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి దుర్గాప్రసాద్ గొడవకు దిగాడు. తన వద్ద ఉన్న కొబ్బరి బొండాలు నరికే కత్తితో చిన్నారావుపై దాడి చేశాడు. ఈ ఘటనలో రవాణాశాఖ అధికారి చేతి బొటనవేలు తెగింది. వెంటనే బాధితుడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.