Araku Politics | ఏపీలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేనలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి .. అంతకు ముందునుంచే టీడీపీ అధినేత ..రా కదలిరా ..పేరుతో రాష్ట్రం అంతా తిరిగేస్తున్నారు. గతంలోనే అరకు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న చంద్రబాబు.. ఆ నియోజకవర్గంలో తాజాగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించేశారు.
Araku Politics | ఏపీలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేనలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి .. అంతకు ముందునుంచే టీడీపీ అధినేత ..రా కదలిరా ..పేరుతో రాష్ట్రం అంతా తిరిగేస్తున్నారు. గతంలోనే అరకు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న చంద్రబాబు.. ఆ నియోజకవర్గంలో తాజాగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న మాజీ మంత్రిని పక్కన పెట్టేశారు. 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అసలు చంద్రబాబు నిర్ణయం వెనుక ఆంతర్యం ఏంటి? .. మాజీ మంత్రికి ఎందుకు సీటు లేకుండా చేశారు?
ఉత్తరాంధ్రలో అత్యంత సుందరమైన నియోజకవర్గం అరకు. ప్రశాంతమైన అరకు నియోజకవర్గం చుట్టూ ఇప్పుడు అన్ని పార్టీల రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అరకు అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గొడ్డెటి మాధవిని ప్రకటించింది. వైసీపీ చేపడుతున్న నియోజకవర్గాల మార్పులో ఎంపీ మాధవిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించింది వైసీపీ అధిష్టానం. దాంతో అక్కడ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత కూడా అరకు ఇంచార్జిగా ఉన్న మాజీ మంత్రి కిడారి శ్రవణ్ను తప్పించి కొత్త అభ్యర్థిని ప్రకటించారు. అరకులో జరిగిన రా కదలి రా సభలో దొన్ను దొర సియ్యారికి నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. దాంతో అక్కడి టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున కిడారి సర్వేశ్వర్రావు గెలుపొందారు. 2018లో జరిగిన మావోయిస్టుల కాల్పుల్లో ఆయన మృతిచెందారు. అప్పుడు పరామర్శకు వెళ్లిన చంద్రబాబు కిడారి కుటుంబానికి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు.
తర్వాత మూడు నెలలకు దివంగత ఎమ్మెల్యే కొడుకు కిడారి శ్రవణ్ను ఎన్నికల్లో గెలవకుండానే సీఎం చంద్రబాబు మంత్రిని చేశారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో కిడారి శ్రవణ్ పరాజయం పాలయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అరకు టీడీపీ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ .. నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలను చేపడుతున్నాడు. అలాంటిది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ఆయన్ని తప్పించి .. ఎమ్మెల్యే అభ్యర్దిగా దొన్ను దొర సియ్యారిని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
2019 ఎన్నికల్లో దొన్ను దొర అరకు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 28 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల వరకు టీడీపీ కొనసాగిన ఆయన .. టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి సెకండ్ ప్లేస్లో నిలిచారు. అప్పట్లో కిడారి శ్రవణ్ మూడో స్థానానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. వైసీపీ గాలి ఉండటంతో కొద్ది ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై దొన్ను దొర ఓటమి పాలయ్యారు. ఆ లెక్కలతోనే చంద్రబాబు కిడారి శ్రవణ్ కు బదులు దొన్ను దొర అయితేనే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చి అరకు అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తుంది.
ముఖ్యంగా వైసీపీ నుంచి ఎంపీ మాధవిని అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించడంతో .. ఆర్థికంగా బలమైన మాధవిని ఎదుర్కోవడం కిడారి శ్రవణ్కు కష్టం అని టీడీపీ భావించినట్లు తెలుస్తుంది. అందుకే దొన్ను దొర అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారంటున్నారు. అదలా ఉంటే ఎంపీగా మాధవి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. దానికి తోడు ఆమె నాన్ లోకల్ కావడంతో మాధవికి టిక్కెట్ ఇస్తే ఒడిస్తామని వైసీపీ కేడర్ బహిరంగంగానే చెప్తోంది. మాధవిపై ఉన్న విమర్శలు, వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
దొన్ను దొర ట్రైబల్ దొర కావడం టీడీపీకి కలిసి వచ్చే అంశంగా అధినేత భావిస్తున్నారంట. గతంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మంత్రి అయిన కిడారి శ్రవణ్.. తర్వాత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం కావడం, దొన్ను దొర ఇండిపెండెంట్గా 28 వేల ఓట్లు తెచ్చుకోవడం ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ కేడర్ అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బలమైన ఓటు బ్యాంక్ కలిగి ఉన్న దొన్ను దొరకి కిడారి శ్రవణ్ వర్గం కలిసొస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయాని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. మరి సీటు గల్లంతైన కిడారి శ్రవణ్ పార్టీ నిర్ణయానికి ఎంత వరకు కట్టుబడి ఉంటారో చూడాలి.