AP New CS : ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా కె. ఎస్. జవహర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ నవంబర్ 30న పదవీ విరమణ చేస్తారు. డిసెంబర్ 1న కొత్త సీఎస్ గా జవహర్రెడ్డి బాధ్యతలు చేపడతారు. 2024 జూన్ వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. అంటే మరో ఏడాదిన్నరపాటు ఆయన సీఎస్ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది.
కొత్త సీఎస్గా నియామకమైన జవహర్రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన కంటే సీనియర్లు నీరభ్ కుమార్ ప్రసాద్ (1987 బ్యాచ్), పూనం మాలకొండయ్య (1988 బ్యాచ్), కరికాల్ వలెవన్ (1989 బ్యాచ్) ఉన్నారు. ముగ్గురు సీనియర్లకాదని సీఎం జగన్ మాత్రం… జవహర్రెడ్డి వైపే మొగ్గు చూపారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జవహర్రెడ్డికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన కోరిక మేరకే… టీటీడీ ఈవోగా నియమించారు. ఆ పోస్టులో కొనసాగిస్తూనే సీఎంవోకి తీసుకొచ్చారు. కొన్ని నెలలపాటు ఆయన రెండు బాధ్యతలను నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా ప్రస్తుతం సీఎంవో వ్యవహారాలు జవహర్ రెడ్డి కనుసన్నల్లోనే జరగుతున్నాయి.
సమీర్శర్మ కోసం కొత్త పోస్టు
ఏపీ సీఎస్గా బుధవారం పదవీ విరమణ చేయనున్న సమీర్శర్మ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టు సృష్టించింది. పదవీవిరమణ తర్వాత ఆయనను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్గా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కోసం సీఎం కార్యాలయంలో కొత్త పోస్టును సృష్టించారు. ప్రణాళికా విభాగం ఎక్స్ ఆఫీషియో కార్యదర్శిగా ఉన్న విజయ్కుమార్ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన కోసం కూడా కొత్త పోస్టు సృష్టించింది. విజయ్కుమార్ను స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా నియమించింది.
పలువురు ఐఏఎస్లు బదిలీ..
ఏపీలో పలువురు ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం స్పెషల్ సీఎస్గా పూనం మాలకొండయ్యను నియమించింది. వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్గా మధుసూదన్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బీ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ కమిషనర్గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహమ్మద్ దివాన్ను నియమించింది. బుడితి రాజశేఖర్ సెలవు నుంచి తిరిగొచ్చాక జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.