Apple Alert to Nara Lokesh : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్ కు యాపిల్ సంస్థ అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. ఆయన ఫోన్ ట్యాపింగ్ కు, హ్యాకింగ్ కు ప్రయత్నాలు జరుగుతున్నట్లు యాపిల్ పంపిన ఈమెయిల్ లో పేర్కొంది. ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని యాపిల్ సంస్థ సూచించింది.
కాగా.. లోకేశ్ ఫోన్ ను ట్యాప్ చేసేందుకు ప్రయత్నించింది వైసీపీనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లోకేశ్ ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈసారి జనంలో వైసీపీ లేకపోవడంతో.. జగన్ దృష్టి ఫోన్ల ట్యాపింగ్ పై పడిందని ఆరోపించారు. టీడీపీ నేతల ఫోన్లను వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోవడంతో.. జగన్ ఇలాంటి పనులు చేస్తున్నాడని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Also Read : కీలకదశకు ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు.. ఎవరు ఆ నలుగురు నేతలు ?
సీఈసీకి టిడిపి నేత కనకమేడల రవీంద్ర కుమార్ సంచలన లేఖ రాశారు. ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పై ఆయన సీఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ ఫోన్ను ట్యాప్ చేశారంటూ ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా.. లోకేష్ ఫోన్ను ట్యాప్ చేసినట్లు ఐ ఫోన్ సందేశాలు వచ్చాయన్నారు. అయితే డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి.. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండేళ్లుగా ఇన్ ఛార్జ్ డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకుని.. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని ఆయన సీఈసీని కోరారు.
మాజీమంత్రి, టిడిపి నేత దేవినేని ఉమా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మండిపడ్డారు. టిడిపి, జనసేన, బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. మన రాష్ట్రంలో ఎంతమంది ప్రణీత్ రావులు ఉన్నారో లెక్క తెలియదన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ పై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్లను ట్యాపింగ్ చేసే పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.