AP State Increased Interest Vote Counting Kurnool District: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ నేతల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.సార్వత్రిక ఫలితాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, వారి అనుచరగణం కర్నూలుకి చేరుకుంటున్నారు. కర్నూలు పార్లమెంట్తో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు రాయలసీమ యూనివర్సిటీలో జరగనున్నాయి. కౌంటింగ్ విధులు నిర్వహించాల్సిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాయలసీమ విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు వీలుగా 4వ తేదీన ఉదయం 5 గంటలకే బస్సులను కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. వీరంతా ఖచ్చితంగా ఉదయమే రావాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఎన్నికల విధుల్లో భాగంగా ఉదయం 5 గంటలకు కర్నూలుకి చేరుకునే పరిస్థితులు లేని కారణంగా ఒక రోజు ముందుగానే ఇక్కడకు చేరుకున్నారు.వీరంతా రాత్రి బస చేసేందుకు తమకు తెలిసిన బంధువులు, స్నేహితుల ఇళ్లు, లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు.కర్నూలులోని పలు ప్రధాన లాడ్జీలతో పాటు చిన్నా చితకా లాడ్జిల్లో కూడా రూములు లేవనే సమాధానం వినిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పలు లాడ్జిల్లో 15 రోజుల ముందుగానే ఈనెల 3వతేది మధ్యాహ్నం నుంచి 4వ తేది వరకు గదులు అడ్వాన్స్గా అద్దెకు దిగారు.
దీంతో మెజారిటీ లాడ్జీలన్ని రాజకీయనేతలతో సందడి చేస్తున్నాయి. ఏసీ రూములు లేకపోయినా ఫరవాలేదు. కనీసం టీవీ ఉంటే చాలు అంటూ నేతలందరు క్యూలైన్ కడుతున్నారు. ఇప్పటికే ప్రధాన లాడ్జీలతో పాటుగా శివారు ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలు కూడా హౌజ్పుల్ బోర్డులు పెట్టే స్థాయికి వచ్చాయి.జిల్లాల్లోని ఒక పార్లమెంట్ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన ప్రధాన పార్టీలకు చెందిన మెజారిటీ అభ్యర్థుల నివాసాలు కర్నూలులోనే ఉన్నాయి. వారి ఇళ్ల వద్దకు పెద్ధ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.