అనకాపల్లి, స్వేచ్ఛ: నమస్కారం పెట్టాల్సి వస్తుందనే సిగ్గుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సెటైర్లు వేశారు. సోమవారం అనకాపల్లి జిల్లా పెద్దగొలుగుండపేటలో జరిగిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అయ్యన్న మాట్లాడుతూ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్ చేశారు. ‘ అసెంబ్లీకి వస్తే సీఎం చంద్రబాబు అయినా సరే నమస్కారం పెట్టాల్సిందే. సార్ అంటూ నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావట్లేదు. జగన్ వస్తే ఇద్దరం ముచ్చటించుకుంటాం. నవంబర్ 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. రాష్ట్రంలో ఇసుక దోపిడి చేసింది వైసీపీ నేతలే’ అని అయ్యన్న మండిపడ్డారు.
వంద రోజుల్లో..
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రూ. 40 కోట్లు తెచ్చానని అయ్యన్న చెప్పారు. ఇందులో నాతవరం మండలానికి ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం చేయలేకపోయిన తాండవ గేటు మరమ్మతు పనులు పూర్తి చేయించామన్నారు. తాను ఇంకో 4 సంవత్సరాల 9 నెలలు అధికారంలో ఉంటానని ఈ లోపు నర్సీపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. పోలవరంపై తాండవ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అయ్యన్న వెల్లడించారు. తాండవ అంచనా వ్యయం రూ. 2,900 కోట్లు అని చెప్పారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని అయ్యన్నపాత్రుడు చెప్పారు.