ఏపీలో అన్ని వర్గాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఇప్పుడు పట్టు బట్టితేనే పనులు పూర్తవుతాయనుకుంటున్నారు. అందుకే నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అంగన్వాడీలతో మొదలైన నిరసనల హోరు వాలంటీర్లు, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తల దాకా వెళ్లింది. ఓవైపు జగన్ సర్కార్ ఎన్నికలకు సిద్ధమవుతుంటే.. ఇదే సమయంలో వరుస ఆందోళనలు పెను సవాళ్లుగా మారుతున్నాయి.
ఏపీలో జగన్ సర్కార్ కు సవాళ్ల మీద సవాళ్లు ఎదురవుతున్నాయి. వరుసగా నిరసనలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలకు తోడు వాలంటీర్లు రెడీ అవుతున్నారు. అటు మున్సిపల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. అటు ఆశా వర్కర్లు కూడా రోడ్డెక్కారు. దీంతో ఎన్నికలకు 3 నెలల ముందు వైసీపీ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది. ఒకరి సమస్య పరిష్కరిస్తే ఇంకోటి ఇబ్బంది వస్తుంది. అలాగని తీర్చకుండా ఉండలేని సిచ్యువేషన్. బుజ్జగింపులతో నెట్టుకొచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. వేతనాలు పెంచుదామంటే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు.
వేతనాలు పెంచాలని ఏపీలో అంగన్వాడీలు గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకో రకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సీఎం జగన్ మనసు మార్చాలని వేడుకున్నారు. కొందరు ఒంటికాలిపై నిరసన చేశారు. ఇంకొందరు రిలే దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఏమీ వినబడడం లేదు, కనబడడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు.
జీతాలు పెంచాలని అంగన్వాడీలు ఎంత గట్టిగా డిమాండ్ చేస్తున్నారో, పెంచేది లేదని ప్రభుత్వం కూడా అంతే గట్టిగా చెబుతోంది. ఇక్కడే పీటముడి పడింది. చీటికీ మాటికీ జీతాలు పెంచాలనే డిమాండ్ ఏంటనేది ప్రభుత్వం వాదన. పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలతో తమకు జీవనం గడవడంలేదనేది అంగన్వాడీల ఆవేదన. అవ్వాతాతలకిచ్చే పెన్షన్ ని ప్రభుత్వం 3వేల రూపాయలకు పెంచింది. ఆ నిష్పత్తిలో తమకు కూడా జీతాలు పెరగాలి కదా అని నిలదీస్తున్నారు అంగన్వాడీలు. ఇది సున్నిత సమస్య. అయితే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదనుకుంటున్నారు అంగన్వాడీలు. అందుకే ఎన్నికల ఏడాదిలో అంగన్వాడీ ఉద్యోగులందరూ రోడ్డెక్కారు.
అంగన్వాడీలకు, సర్కార్ కు మధ్య దఫదఫాలుగా జరుగుతున్న చర్చలు విఫలమవుతున్నాయే కానీ ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం మాత్రం సాధ్యం కావడంలేదు. అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ మరోసారి చర్చలు జరిపింది. అయితే వేతనాలు పెంపు తప్ప మిగతా అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం అంటూ వస్తోంది. ఒకరికి వేతనాలు పెంచితే… ఆ వెంటనే వాలంటీర్లు, మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తలు లైన్ లో ఉన్నారు. వీరందరికీ పెంచాల్సి వస్తుందన్న ఆలోచనతో జగన్ సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఏపీ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీ పక్కన పెట్టారని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. ఆ హామీని అమలు చేయాలని అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వేతన పెంపు మినహా ఇతర అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలుస్తోంది. అయితే గతంలో రెండు సార్లు చర్చలు జరిగినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని అంగన్వాడీ సంఘాలు అంటున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని అంగన్వాడీలు కోరుతున్నారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతున్నారు.
.
.