AP Politics : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్లు రాజీనామా చేస్తే.. మరికొందరు రాజీనామాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా దివంగత వైఎస్ ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడి.. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న ఆయన వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించి ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఆయనిప్పుడు జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు.
సీఎం జగన్ సన్నిహితులు, ఆయన కుటుంబసభ్యుల్లా మెలిగినవారు, వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయుల్లాంటి నేతలు ఒక్కొక్కరుగా జగన్ వైఖరితో వైసీపీకి రాజీనామా చేస్తుండటం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తాజాగా తన రాజీనామాను ప్రకటించారు. అడుగడుగునా అవమానాలను భరిస్తూ వైసీపీలో కొనసాగలేనంటూ ఆయన పార్టీకి గుడ్బై చెప్పేశారు. జగన్పై తిరుగుబాటు ప్రకటించిన సన్నిహితుల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితోపాటు ఇప్పుడు బాలశౌరి చేరారు.
వల్లభనేని బాలశౌరి వైఎస్ ప్రోత్సాహంతో 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో తెనాలి లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు.. తర్వాత2009లో నరసరావుపేట లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్ మీద అభిమానంతో బాలశౌరి 2013లో వైసీపీలో చేరి.. 2014లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో మచిలీపట్నం లోకసభ నియోజకవర్గానికి షిఫ్ట్ అయి.. రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
వైఎస్ కుటుంబానికి అంత సన్నిహితులైన బాలశౌరి సడన్గా రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మచిలీపట్నం నుంచి ఎంపీగా వేరొక వ్యక్తిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి.. ఇలా రాజీనామా చేశారనే టాక్ నడుస్తోంది. మచిలీపట్నం నుంచి ఎంపీగా మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నారని.. అందుకే బాలశౌరిని పొమ్మనలేక హైకమాండ్ పొగబెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రిపేర్ని నానికి, బాలశౌరికి మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. మచిలీపట్నం లో దాదాపు రెండేళ్ల క్రితం ఎంపీ బాలశౌరి పర్యటన సమయంలో వారి మధ్య అంతర్గత విభేదాలు బయట పడ్డాయి. ఎంపీ పర్యటనను వైసీపీ కార్పొరేటర్ ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేయటం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇనకుదురుపేటలోని ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి కోసం నిధులివ్వాలని స్థానికులు కోరటంతో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎంపీ అక్కడకు వెళ్లారు. సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ తనకు చెప్పకుండా తన డివిజన్కు ఎంపీ రావటం సరికాదని.. ఎంపీ వెనక్కి వెళ్లిపోవాలంటూ అనుచురులతో మోహరించి అడ్డుకునే ప్రయత్నంచేశారు. సదరు పేర్ని నాని ముఖ్య అనుచరుడు కావడంతో ఈ ఆందోళన వెనుక ఆయన హస్తం ఉందని ఎంపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత బందరు పోర్టు పనుల ప్రారంభానికి పూజలంటూ .. జగన్ అక్కడకి వచ్చినప్పుడు వారి మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడైన పేర్ని నాని అధికార కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. బాలశౌరితో విభేదాల కారణంగా అప్పట్లో నాని గైర్హాజయ్యారన్నది బహిరంగ రహస్యమే. ఇక ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య జ్ఞాపకార్థం బందరులో మ్యూజియం, ఆడిటోరియం నిర్మించేందుకు బాలశౌరి ప్రయత్నించారు. దానికి పేర్ని నాని అడ్డుపడ్డారన్న ప్రచారం ఉంది. ఇలా వారిద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి.
వాస్తవానికి పేర్ని నాని, ఎంపీ బాల శౌరి ఇద్దరూ సీఎంకు సన్నిహితులే .. 2019 ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన వారిద్దరి మధ్య గెలిచాక మాత్రం వివాదాలు ప్రారంభమయ్యాయి. ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. నాని మంత్రిగా ఉన్నప్పుడు ఆధిపత్యం కొనసాగించడంపై బాలశౌరి వర్గం బహిరంగంగానే విమర్శలు చేసింది. మరోవైపు తన మంత్రి పదవి ఊడిపోయాక .. ఎంపీ పెత్తనం చేస్తున్నారని నాని అంటుంటారు.
ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కిట్టును మచిలీపట్నం నుంచి బరిలోకి దింపడానికి పేర్ని నాని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే పేర్ని నానిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉందంట. అది తెలిసే బాలశౌరి రాజీనామా చేశారంటున్నారు. మరోవైపు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఢిల్లీలో గత నెల ఎంపీలందరికీ విందు ఇచ్చారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి మినహా దాదాపు మిగిలిన వైసీపీ ఎంపీలంతా ఈ విందుకు హాజరయ్యారు. దానిపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారట. ఆ సమయంలో ఆయన బాలశౌరి పట్ల అవమానకరంగా మాట్లాడినట్లు వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
ఏది ఏమైనా పార్టీ వైఖరితో ముందు నుంచి అసంతృప్తిగా ఉన్న బాలశౌరి.. సిటింగ్ ఎంపీగా తాను ఉన్నా.. తనతో సంబంధం లేకుండా మచిలీపట్నం లోక్సభ స్థానానికి కొత్త ఇన్ఛార్జ్ని తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలిసి.. తన నిర్ణయం ప్రకటించేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని.. పవన్కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నానని బాలశౌరి శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటించేశారు. ఎంపీగా పోటీ చేసిన నాలుగు సార్లూ.. నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బాలశౌరి.. ఈ సారి ఎక్కడ నుంచి పోటీలో ఉంటారో చూడాలి.
.
.