AP Politics : ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత , సీఎం జగన్ నియోజకవర్గాల ఇన్ ఛార్జులను మారుస్తూ ఆ పార్టీ నేతల్లో గుబులు రేపారు. కొందరు మంత్రులకు స్థానం చలనం కల్పించారు. ఇంకొందరు ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. కొందరి సీట్లను పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు వైసీపీలో సీట్లు కేటాయింపు అంశంగా హాట్ గా మారింది. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతికి కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు జనసేనాని కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు.
ఈ సారి ఎన్నికల్లో చాలా మంది వారసులను రంగంలోకి దించాలని టీడీపీ భావిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యువనేతలకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ కుమార్తె శిరీష మరోసారి బరిలో దిగుతారని టాక్ నడుస్తోంది. ఆమె ఇప్పటికే పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పలాసలో ప్రస్తుత మంత్రి సీదిరి అప్పలరాజు చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆమెకే టిక్కెట్ దక్కుతుందని అంటున్నారు.
ఎచ్చెర్లలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు పోటీ చేస్తారని చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో కళావెంకట్రావు ఓడిపోయారు. ఇప్పుడు కుమారుడిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. పాతపట్నంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కలమట వెంకట రమణ ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కుమారుడు సాగర్ ను బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అశోక గజపతి రాజు కుమార్తె అదితి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ.. రాజాం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ప్రతిభా భారతి 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019లో ఆమెకు టీడీపీ టిక్కెట్ దక్కలేదు. ఈసారి కుమార్తె గ్రీష్మను పోటీ చేయిస్తారనే టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కొడుకు నాగార్జున మరోసారి చీపురుపల్లిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఎన్నికల్లో మంత్రి బొత్స సత్యనారాయణ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. నెల్లిమర్లలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు మనవడు పతివాడ తారక రామానాయుడు బరిలోకి దిగుతారని తెలుస్తోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు రాజకీయ వారసుడిగా విజయ్ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు బరిలో ఉంటారని తెలుస్తోంది. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి మనవడు, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరోసారి ఆయన పోటీ చేయడం ఖాయమే. దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ 2014 ఎ ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖ వెస్ట్ లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఇటీవల తండ్రితో కలిసి టీడీపీ గూటికి చేరారు. రత్నాకర్ మరోసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను తుని లేదా రాజానగరం నుంచి బరిలోకి దింపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దివంగత్ లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్మాధుర్ గత ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మరోసారి ఆయనకే టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయి.
దిగంగత నేత ఎర్రన్నాయుడి కుమార్తె ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి సిటీ నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో ఆమె తొలిసారిగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ ను ఇక్కడ ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు ఎంపీ అభ్యర్థిగా దివంగత నేత , మాజీ ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ పోటీ టీడీపీ తరఫున చేస్తారనే వార్తలు వస్తున్నాయి. రఘురామ కృష్ణంరాజు కుమారుడు భరత్ కూడా ఎన్నికల బరిలో ఉంటారని అంటున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కుమారుడు కృష్ణప్రసాద్ టిక్కెట్ రేసులో ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజా పామర్రు నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ అవనిగడ్డ టిక్కెట్ ఆశిస్తున్నారు.
ఉమ్మడి గుంటూరులో దివంగత నేత కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు, సోదరుడు శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యే టిక్కెట్ల రేసులో ఉన్నారు. లాల్జాన్ బాషా తమ్ముడు జియావుద్దీన్, కుమారుడు గయాదుద్దీన్ గుంటూరు తూర్పు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు రాజగోపాల్ రెడ్డి టిక్కెట్ రేసులో ఉన్నారు.అనంతపురం జిల్లా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి కుమారుడు అస్మిత్రెడ్డి కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. రాప్తాడులో పరిటాల శ్రీరామ్ మరోసారి పోటీ చేయనున్నారు. శ్రీరామ్ గత ఎన్నికల్లో ఓడిపోయారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్రెడ్డికి టిక్కెట్ దక్కే ఛాన్స్ ఉంది. నగరి టిక్కెట్ ను దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి పెద్దకుమారుడు.. భాను ప్రకాశ్ టిక్కెట్ రేసులో ఉన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి, ఆయన తమ్ముడి భార్య అనీషా రెడ్డి టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు లో టిక్కెట్ ఆశిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు, భూమా నాగిరెడ్డి వారసుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, టీజీ వెంకటేశ్ కుమారుడు అసెంబ్లీ టిక్కెట్ల రేసులో ఉన్నారు. కడప జిల్లాలో మాజీ మంత్రి ఖలీల్ బాషా కుమారుడు డాక్టర్ సోహైల్ ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నారు.
మరోవైపు వైసీపీలోనూ వారసులు ఎన్నికల వార్ లోకి దిగుతున్నారు. ఇప్పటికే కొందరికి టిక్కెట్లను సీఎం జగన్ ప్రకటించారు. మచిలీపట్నంలో పేర్నినాని కొడుకు కృష్ణమూర్తి(కిట్టు), రామచంద్రాపురంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు సూర్యప్రకాష్ , గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తాఫా కూతురు నూరి ఫాతిమా, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కుమారుడు మోహిత్ టిక్కెట్ పొందారు.
తిరుపతి నుంచి భూమన కరుణాకర రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.