AP police stopped Jagan convoy at Vinukonda
ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత షేక్ రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి సమాయత్తమైన వైఎస్ జగన్ వినుకొండకు బయలుదేరారు. బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ రషీద్ హత్య ఉదంతంతో వారి కుటుంబ సభ్యులను కలుద్దామని ఏపీకి వచ్చారు. తాడేపల్లి ప్రాంతంలో తన నివాసం నుంచి కాన్వాయ్ లో బయలుదేరారు. అయితే వైఎస్ జగన్ కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసీ పనిచేయలేదు. ఆయనకు కార్యకర్తలు అప్పటికప్పుడు వేరే వాహనం కేటాయించారు.
జగన్ వెంట కార్యకర్తలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు కార్యకర్తలు, మాజీ మంత్రులు తమ సొంత వాహనాలతో బయలు దేరారు. కాగా శుక్రవారం రషీద్ కుటుంబ సభ్యులను కలుద్దామనుకుని బయలుదేరిన వైఎస్ జగన్ ను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. జగన్ తో పాటు ఆయన కార్యకర్తలు, మంత్రులను సైతం అడ్డుకున్నారు .రషీద్ హత్య దృష్ట్యా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బహిరంగ సభలు, గుంపులుగా జనం చేరడం, అనుమతి లేకుండా వినుకొండకు వెళ్లడం పై నిషేధాజ్ణలు అమలు లో ఉన్నాయని..ఎట్టి పరిస్థితిలోనూ వెళ్లనిచ్చేది లేదని జగన్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు.
పోలీసులపై సీరియస్
శాంతియుతంగా తమ నేత రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న తమపై ఏపీ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. రాష్ట్రానికి సీఎంగా చేసిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. రాత్రికి రాత్రే మాజీ సీఎం సెక్యూరిటీని ఎలా తగ్గించేస్తారని ప్రశ్నించారు. పైగా సాంకేతికంగా ప్రాబ్లం ఉన్న కార్లను కేటాయించి తమ నేతను అవమాన పరుస్తున్నారంటూ రోడ్డుపైనే భైఠాయించారు. దీనితో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. కొద్ది సేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. దీనితో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం. రెండు రోజుల క్రితం పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన రషీద్ ని జిలానీ అనే వ్యక్తి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. వైఎస్ ఆర్ యువజన విభాగంలో యువ నేతగా రషీద్ మంచి గుర్తింపు పొందాడు. వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఈ హత్యను ఇరు పార్టీ నేతలూ రాజకీయం చేసి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. రెండు రోజులుగా ఇరు పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది.హత్య చేయించింది మీరంటే మీరని ఇరు పార్టీలు వాగ్వాదం చేసుకుంటున్నాయి.
144 సెక్షన్ అమలు
ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడ ఎవరినీ బహిరంగ ర్యాలీలు, సభలకు అనుమతించలేదు. 144 సెక్షన్ అమలు విధించారు. రషీద్ హత్య తనని తీవ్రంగా కలచివేసిందని జగన్ స్పందించారు. దీనిపై కేంద్రానికి ఆయన లేఖ కూడా రాశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, టీడీపీ శ్రేణులు తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని కొందరు వీళ్ల ఆగడాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలు, హత్యలు, వేధింపులు చేస్తున్నారని..ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకోవాలని..వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానికి జగన్ లేఖ రాశారు.