ఏపీ పాలిటిక్స్లో రాజ్యసభ ఎన్నికల వేడి రాజుకుంది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ, వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఆసక్తిగా మారింది.
ఇవాళ స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. టీడీపీ మద్దతుదారులు ముగ్గురు, వైసీపీ మద్దతుదారులు ఒక్కరు నిన్నటి విచారణకు హాజరయ్యారు. మద్దాలి గిరిధర్ మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశీ పర్యటనలో ఉండటంతో ఫిబ్రవరి 2వ తేదీ వరకూ గడువు కావాలని ఆయన కోరారు. కాగా.. ఏపీలో టీడీపీ, వైసీపీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ ఫిర్యాంపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుంచి టీడీపీలో చేరగా.. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ టీడీపీ నుంచి వైసీపీలో చేరి రెబల్స్గా మారారు. ఇక ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య వైసీపీ నుంచి టీడీపీలోకి, వంశీకృష్ణయాదవ్ జనసేనలో చేరారు.
వీరికి గతంలో స్పీకర్ నోటీసులు జారీ చేశారు. తాజాగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం అనర్హత వేటుపై విచారణతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోపక్క రాజ్యసభ ఎన్నికల్లో భయంతోనే అనర్హత వేటు వేసిందని స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. అయితే.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.