వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి
మరణాలపై ఇంతవరకూ రాని స్పష్టత
రంగంలోకి దిగిన ఇద్దరు మంత్రులు
జిల్లా అధికారులతో నారాయణ సమీక్ష
బోరు నీటిని ల్యాబ్కు పంపాలని ఆదేశాలు
మెడికల్ క్యాంపులు పెంచాలన్న గొట్టిపాటి
పల్నాడు, స్వేచ్ఛ:
Diarrhoea Cases Palnadu: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో ఇద్దరు వ్యక్తులు వాంతులు, విరేచనాలతో మృతి చెందారు. మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో దాచేపల్లి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల విజయనగరం జిల్లా గజపతినగరంలో డయేరియాతో పలువురు మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దాచేపల్లి మరణాలపై ఆరా తీసిన ప్రభుత్వం ఇద్దరు మంత్రులను రంగంలోకి దింపింది. జిల్లా అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే నీరు కలుషితం కావడంతో చనిపోయారా? లేక వేరే కారణాలున్నాయా? అనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో స్థానికంగా ఉన్న బోర్లు అన్నింటినీ మూసివేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వెంటనే ఆ బోర్లలో నీటిని పరీక్షల కోసం విజయవాడ ల్యాబ్కు పంపాలని మంత్రి సూచించారు. సాధారణ పరిస్ధితి వచ్చే వరకూ మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలన్నారు.
అవగాహన కల్పించండి..
ఈ ఘటనపై ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. పల్నాడు కలెక్టర్తో మాట్లాడిన మంత్రి వైద్యాధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. డయేరియా లక్షణాలు ఉన్న ప్రాంతాల్లో తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. మెడికల్ క్యాంపుల సంఖ్య పెంచాలని మంత్రి సూచించారు. సంబంధిత ప్రాంతాల్లో బ్లీచింగ్, క్లోరినేషన్ ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. డయేరియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ను గొట్టిపాటి సూచించారు.