AP: ఏపీ సర్కారు చాలా తెలివిగా వ్యవహరించింది. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దుపై చర్చించకుండా.. ఉద్యోగుల మిగతా సమస్యలకు మాత్రం శుభం కార్డు వేసింది. మార్చి నెలాఖరు నాటికి.. 3వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయినా, ఉద్యమ కార్యచరణపై వెనక్కి తగ్గలేదు ఉద్యోగ సంఘాలు. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరిస్తే.. అప్పుడు చూస్తాం అన్నట్టు చెప్పారు.
సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ తదితర సంఘాలను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించారు. ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని చర్చలకు పిలవకుండా పక్కనపెట్టేసింది ప్రభుత్వం.
ఉద్యోగుల పీఎఫ్ పెండింగ్ బిల్లులన్నీ ఈ నెలలోనే క్లియర్ చేస్తామని సర్కార్ తరఫున మంత్రులు హామీ ఇచ్చారు. కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిందని, అందుకే ఉద్యోగులకు చెల్లింపులు చేయలేకపోయామని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. ఉద్యోగుల సమస్యలపై రెండు మెట్లు దిగే చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
అయితే, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని.. తమ ఉద్యమ కార్యాచరణ యధావిధిగా ఉంటుందని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. త్వరలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై చర్చిస్తామన్నారు.