AP Liquor Policy: ఉదయం మద్యం లాటరీలో అదృష్టం తలుపు తట్టింది అతనికి. అతను ఆ ఆనంద క్షణాల్లో ఉండగా.. ఏమైందో ఏమోగానీ.. నా భర్త కనిపించడం లేదంటూ.. అతని భార్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. !
ఏపీ లోని అన్ని జిల్లాలలో నేడు నూతన మద్యం పాలసీకి సంబంధించి, లాటరీ పద్ధతిన మద్యం షాప్ లైసెన్స్ దారులను అధికారులు ప్రకటించారు. అన్ని జిల్లాలలో లాటరీ ప్రక్రియను పూర్తి విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసి సఫలీకృతులయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. మద్యం షాపుల లాటరీ ప్రక్రియ పూర్తయింది. దీనితో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా తాజాగా రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన సంచలనంగా మారింది. ఉదయం లాటరీ ద్వారా మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తి.. సాయంత్రానికి అదృశ్యమైనట్టు అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలానికి చెందిన రంగనాథ్ అనే వ్యాపారి.. మద్యం షాపు కోసం తన దరఖాస్తు సమర్పించారు.
ఈరోజు లాటరీ తీస్తున్న సందర్భంగా పుట్టపర్తికి వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదృష్టవశాత్తు అతనికి మద్యం షాపు దక్కింది. అయితే మద్యం షాపు దక్కిన ఆనందంలో రంగనాథ్ లాటరీ ప్రక్రియ జరుగుతున్న కార్యాలయం నుండి బయటకు రాగానే.. గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను అపహరించుకు వెళ్లినట్లు భార్య అశ్విని, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మద్యం షాపు దక్కించుకున్న కొద్ది నిమిషాలకే తన భర్త కిడ్నాప్ కు గురైనట్లు ఆమె ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసలు వ్యాపారిని ఎవరైనా తీసుకువెళ్లారా.. లేక తనకు తానుగా వేరే వారితో కలిసి స్వయంగా వెళ్లారా.. అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా తన భర్త కనిపించకపోవడంతో భార్య అశ్విని తీవ్ర ఆవేదన చెందుతూ.. త్వరగా తన భర్త ఆచూకీ కనుగొనాలని పోలీసులను వేడుకుంటోంది.
రాష్ట్ర వ్యాప్తంగా లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్న అధికారులకు.. ఈ ఘటన కొంత కలవరానికి గురి చేసిందని చెప్పవచ్చు. అందుకే పోలీసులు వెంటనే అప్రమత్తమై.. ఇందులో గల వాస్తవాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. మరి పోలీసుల ప్రకటనతో అసలేం జరిగిందనేది తెలియాల్సి ఉంది.