AP Ministers: తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని, తిరుపతి లడ్డు వ్యవహారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటూ మంత్రి అన్నారు.
కాగా తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. సిట్ స్థానంలో కొత్త విచారణ కమిటీని న్యాయస్థానం ప్రకటించింది. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండాలని, సీబీఐ డైరెక్టర్ డైరెక్షన్ లో ఇద్దరు సీబీఐ అధికారులు, మరో ఇద్దరు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో పాటు, ఒకరు సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారిని ఇందులో సభ్యులుగా ఉండాలని సూచించింది. ఈ విచారణ కమిటీలో రాజకీయ జోక్యం ఉండకూడదని సూచించింది.
ఇలా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై.. ఏపీకి చెందిన మంత్రులు స్పందించారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు తాము ఎప్పుడూ ముందు ఉంటామన్నారు. అలాగే అసలు తిరుమల లడ్డు వ్యవహారమనేది.. కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి.. వాస్తవాలు విచారణ కమిటీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే సుప్రీం తీర్పుపై మాజీ సీఎం జగన్ స్పందించి.. టీడీపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. జగన్ చేసిన విమర్శలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా స్పందించారు. తిరుమల లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి సేకరణ విధానంలో మార్పులు చేసింది ఎవరు అంటూ ప్రశ్నించారు. అలాగే కల్తీ నెయ్యి వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండపైకి వెళ్ళిందని, తిరుమల పవిత్రత గురించి, ప్రాశస్త్యం గురించి జగన్ మాట్లాడడం మా ఖర్మ అంటూ విమర్శించారు. డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని తిరుమలకు వెళ్లని జగన్.. నేడు సనాతన ధర్మంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని.. అలాగే తిరుమల పవిత్రతను కాపాడుతున్న టీడీపీని విమర్శించడం తగదన్నారు.
అలాగే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం మాట్లాడుతూ.. ప్రసాదంపై రాజకీయం చేయవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించిందన్నారు. ఆ మాటలు మాజీ సీఎం జగన్ను ఉద్దేశించే సుప్రీంకోర్టు హెచ్చరికలు చేసిందన్నారు. గత ఐదేళ్లు హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని, ఆ దాడులపై జగన్ చర్యలు తీసుకోకపోగా కనీసం నోరు మెదపలేదని మంత్రి అన్నారు.