AP Highcourt : అమరావతి ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. రాజధానేతర ప్రాంత ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం అమరావతిలో ఆర్-5 జోన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేసింది. ఈ మేరకు జీవోలు ఇచ్చింది. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసింది. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ఇటీవల సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ అమరావతి ప్రాంత రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐక్య కార్యాచరణ సమితి హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని తీర్పు నిచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు విధించిన స్టేను తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.