AP High Court : విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాల తరలించాలన్న ఏపీ సర్కార్ కు షాక్ తగిలింది. ఆఫీసుల తరలింపు కోసం ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కార్యాలయాల తరలింపు అంశంపై మంగళవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
ప్రభుత్వ కార్యాలయాలను అమరాతి నుంచి వైజాగ్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఈ పిటిషన్లను హైకోర్టు సింగిల్ జడ్జి.. త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపారు. త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆఫీసులను తరలించే చర్యలు చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.
మరోవైపు కార్యాలయాల తరలింపు అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని జగన్ సర్కార్ గురువారం లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రైతుల దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రం మంగళవారం విచారణ చేపడతామని స్పష్టంచేసింది.