Nara Chandrababu Naidu : టీడీపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అంగళ్లు అల్లర్లు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లకు నిరాశే ఎదురైంది. ఈ మూడు కేసులు విచారణలో ఉండటంతో ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులు విచారణ దశలో ఉన్నాయని, చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దంటూ సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫైబర్ గ్రిడ్ కేసులో టెండర్లు ఇచ్చిన కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉందన్న విషయం కోర్టుకు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలాట్ మెంట్ ను రెండోసారి క్యాన్సిల్ చేసి మార్చారని, ఈ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారని వాదించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో చంద్రబాబుకు ఒక గెస్ట్ హౌస్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చారని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
కాగా.. చంద్రబాబు ఉంటున్న గెస్ట్ హౌస్ కు రెంట్ కడుతున్నారని, అలాంటపుడు అది గిఫ్ట్ ఇచ్చినట్లు ఎలా అవుతుందని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించారు. అంగళ్ల పిటిషన్ కు సంబంధించి.. చంద్రబాబు రాయలసీమలో పర్యటించినపుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఆయనపై అంటెప్ట్ టు మర్డర్ కేసు కూడా నమోదైందని సీఐడీ న్యాయవాది వాదించారు. సీఐడీ వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించి.. చంద్రబాబుకు బెయిల్ నిరాకరిస్తూ.. ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. స్కిల్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని తెలుగు తమ్ముళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.