Amaravati: ఏపీ రాజధాని రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. R5 జోన్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయొద్దని రైతులు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఐతే.. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని ధర్మాసనం ఆదేశించింది.
అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జీవో నెం.45పై రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికో పరిమితం కాదని.. రాజధాని ప్రజలందరిదని.. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా? అంటూ సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమేనని కోర్టు అభిప్రాయపడింది. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదంది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవేనని.. ఆ భూములు ఇప్పుడు రైతులవి కావని.. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పుతో ఒక్కో కుటుంబానికి సెంటు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో.. 10 లేఅవుట్లలో 48 వేల మంది పేదలకు స్థలాలు పంపిణీ చేయనుంది. ఈ నెల 15 లోగా పట్టాల పంపిణీ పూర్తి చేసేలా కార్యచరణకు సిద్ధమవుతున్నారు అధికారులు.