AP: ఏపీ పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం వచ్చాక రాజకీయ వేడి మరింత పెరిగింది. వైసీపీ, టీడీపీ, జనసేనల మధ్య ట్రయాంగిల్ వార్ జోరుగా నడుస్తోంది. జీవో నెంబర్ 1తో ఏపీ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. ఇక, తామేమైనా తక్కువా అన్నట్టు ఉద్యోగ సంఘాలు సైతం పీఆర్సీ ఎపిసోడ్ నుంచి సర్కారుపై సమరం చేస్తున్నాయి. లేటెస్ట్ గా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు నేరుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి.. తమకు జరుగుతున్న అన్యాయంపై, జగన్ ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేయడం మరింత సంచలనంగా మారింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు ఇటీవల గవర్నర్ను కలిశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీరుపై ఏపీ ఎన్జీవో సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో విషయం మరింత ముదిరింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను కొన్ని శక్తులు వెనక ఉండి నడిపిస్తున్నాయని ఆరోపించింది ఎన్జీవో సంఘం. రోసా నిబంధనలకు విరుద్ధంగా ఆ సంఘానికి గుర్తింపు ఇచ్చారని.. అందుకే వెంటనే గుర్తింపు రద్దు చేయాలని చీఫ్ సెక్రటరీ జవహరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు ఏపీ ఎన్జీవో సంఘం నేతలు.
కట్ చేస్తే.. ఏపీ సర్కార్ యాక్షన్ లోకి దిగింది. ప్రభుత్వంపైనే గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారా? అని కన్నెర్ర జేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది.
వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా.. గవర్నర్ ను ఎందుకు కలిశారని నోటీసులో ప్రశ్నించింది ప్రభుత్వం. గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పరిస్థితి చూస్తుంటే.. వేటు తప్పకపోవచ్చని అంటున్నారు.