AP : ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సేవలందించేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,489 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దూర ప్రాంతాలు, అంతర్రాష్ట సర్వీసుల కోసం ఈ బస్సులను వినియోగించనుంది.
డీలర్ల వద్ద నుంచి కాకుండా నేరుగా బస్సుల తయారీ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో బస్ ఖరీదు దాదాపు రూ.45 లక్షల చొప్పున మొత్తం రూ.670 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే జ్యుడీషియల్ ప్రివ్యూకు ఆర్టీసీ నివేదించింది. టెండర్ డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టెండరు నిబంధనలు, ఇతర అంశాలపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ-మెయిల్ ద్వారా తెలిపే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చింది.