Amaravati: ఏపీ రాజధాని ఏది? టెక్నికల్ గా అయితే అమరావతినే. కానీ, వాస్తవంలో పక్కాగా ఓ కేపిటల్ అంటూ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు హయాంలో అంతర్జాతీయస్థాయి రాజధాని కాన్సెప్ట్ తో అమరావతి నిర్మాణం ప్రారంభించారు. అంతలోనే ప్రభుత్వం మారి జగన్ ముఖ్యమంత్రిగా వచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణను తెరమీదకు తీసుకొచ్చింది. అమరావతి కేవలం శాసన రాజధానికే పరిమితం చేసింది. విశాఖ పాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని పేర్లైతే పెట్టారు కానీ.. ఇంకా ఉనికిలోకి రాలేదు.
అమరావతిపై అధికార ప్రతిపక్షాల పోరు మామూలుగా లేదు. అమరావతిని చంపేశారని పదే పదే విమర్శలు. ఇక, రాజధాని గ్రామ ప్రజలైతే అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దీక్షలు, కేసులు, కంచెలు, పాదయాత్రలతో అమరావతి డిమాండ్ ను నెలల తరబడి సజీవంగా ఉంచుతున్నారు. కట్ చేస్తే….
అమరావతిపై పార్టీల రాజకీయం ఎలా ఉన్నా.. న్యాయస్థానం నిర్ణయమే అత్యంత కీలకం. కోర్టు ఏది చెబితే అదే ఫైనల్. ఇప్పటికే ఏపీ హైకోర్టు గడువు విధించి మరీ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందేనని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సర్కారు సందిగ్థంలో పడింది. అలా కుదరదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అక్కడ సీన్ మారిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ఏపీ రాజకీయాలను అమాంతం ప్రభావితం చేసే అవకాశం ఉంది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకరిస్తే ఎలా? అని ప్రశ్నించింది. రాజధాని అదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేమని తెలిపింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? ఆరు నెలల్లో నిర్మాణం చేయాలని ఎలా తీర్పు ఇస్తారంటూ.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టైంది. అమరావతి విషయంలో ఇన్నాళ్లు హైకోర్టులో పదే పదే ఎదురుదెబ్బలు తగులుతున్న సర్కారుకు సుప్రీం తీర్పుతో ఎంతో ఊరట. ఇక వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ ను మరింత వేగంగా అమలు చేసే ఛాన్స్ ఉంది. విశాఖ నుంచే అసలైన పాలన అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతీసారీ చెబుతూనే ఉన్నారు. ఇక ఆ మాట ఆచరణలోకి వచ్చే సమయం ఎంతో దూరంలో లేదంటున్నారు. హైకోర్టు తీర్పు వల్లే మూడు రాజధానుల నిర్ణయం అమల్లోకి రాకుండా ఆగిపోగా.. లేటెస్ట్ గా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఇక సర్కారు దూకుడు పెంచనుంది. వికేంద్రీకరణే మా విధానం అంటూ ప్రభుత్వం తరఫున సలహాదారు సజ్జల ఆ వెంటనే ప్రకటించేశారు.
మూడు రాజధానులను అమరావతి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. అలాగని వారు రాజధాని తరలింపును అడ్డుకోనూ లేరు. ఇక రాజధాని విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీల పోరాట పంథా ఎలా ఉండనుందనేదే ఆసక్తికరం.