AP Government Paddy Procurement dues will Release: ఆంధ్రప్రదేశ్ రైతులకు మంచి శుభవార్త. రైతులకు సంబంధించిన ధాన్యం బకాయిలను కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. గత రబీలో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన బిల్లులను నేడు క్లియర్ చేయనున్నారు. దీంతో దాదాపు 35, 374 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
గత రబీలో ధాన్యం విక్రయించిన 35,374 మంది రైతులకు రూ.674.47 కోట్ల బకాయిలను మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు. ఏలూరులో జరిగే కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల బకాయిలకు సంబంధించిన చెక్కులను రైతులకు అందజేయనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో 82,825 మంది రైతులకు రూ.1657.44కోట్ల బకాయిలు ఉండగా.. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుంది. ఇందులో భాగంగానే గత నెలలో 49,350 మంది రైతులకు రూ.1000కోట్లు మంజూరు చేసిందని సర్కార్ తెలిపింది.
ఇదిలా ఉండగా, గత వైసీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసిందని ఇటీవల టీడీపీ నాయకులు ఆరోపించారు. రైతుల నుంచి మార్చి, ఏఫ్రిల్ నెలల్లో ప్రభుత్వం ధాన్యం సేకరించి..బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రబీ పెట్టుబడి బకాయిలు రాకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు చెల్లించలేక రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యను కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి ముమ్మరంగా చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కష్టాల్లో ఉన్నా.. పవన్ కళ్యాణ్ అండగా నిలవాలి: దివ్వెల మాధురి
ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు స్పందించి రైతుల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని మంత్రి నాదెండ్ల అన్నారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ హయాంలో రైతులు అన్ని విధాలా చితికిపోయారని మనోహర్ ఆరోపించారు. గత ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ఆహారధాన్యాలకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా బకాయిలు పెట్టి రైతులు ధైర్యం కోల్పోయేలా చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలుస్తుందని పేర్కొన్నారు.