Criminal Case Filed on Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. రాష్ట్రంలో వాలంటీర్లకు వ్యతిరేకంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారన్న ఆరోపణలతో గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది. దీనిపై జిల్లా ప్రధాన న్యాయస్థానం విచారణకు స్వీకరించి.. 499,500, ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై క్రిమినల్ కేసుల్ని నమోదు చేసింది. అనంతరం దానిని నాల్గవ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేయగా.. మార్చి 25న పవన్ కల్యాణ్ విచారణకు హాజరు కావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులు ఇచ్చారు.
గతేడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో.. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కేంద్ర నిఘావర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29 వేల నుంచి 30 వేల మంది మహిళలు, యువతులు అదృశ్యమయ్యారని ఆరోపణలు చేశారు. వారిలో 14 వేల మంది తిరిగివచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మరి మిగతా అమ్మాయిల ఆచూకీ గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. డీజీపీ కూడా దీనిపై సమీక్షించలేదన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ కారణంగానే రాష్ట్రంలో అమ్మాయిలు అదృశ్యమవుతున్నారన్నారు.
Read More : ఘనంగా వైఎస్ షర్మిల కుమారుడి వివాహం.. మేనల్లుడి పెళ్లికి జగన్ దూరం
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలోని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. ఒంటరి మహిళలే టార్గెట్ గా కొన్ని సంఘ విద్రోహశక్తుల ద్వారా వారిని అపహరిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. దీని వెనుక వైసీపీ లో కొందరు నేతల హస్తం ఉన్నట్లు తన కేంద్ర నిఘావర్గాల నుంచి సమాచారం ఉందన్నారు. అప్పట్లో పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై పత్రికలు, టీవీ ఛానల్స్ లో వచ్చిన వార్తల ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వం దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం గతేడాది జులై 20న పవన్ కు ఉత్తర్వులు ఇచ్చింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ బి.పవన్ కుమార్ సహా.. మరికొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూలం మేరకు పవన్ పై కేసు దాఖలు చేస్తున్నట్లు పీపీ తన ఫిర్యాదులో వివరించారు. ఈ కేసుపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.