AP Government Nominated Posts(Andhra pradesh today news): ఏపీ ఎన్నికలలో అనూహ్య విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి అసలైన అగ్నిపరీక్ష మొదలు కానుంది. మొన్నటి ఎన్నికలలో సీట్ల పంపిణీ నుంచి మంత్రి పదవుల వరకూ కూటమితో సర్థుబాట్లు చేసుకుంటూ తమ పార్టీనే నమ్మకుని..మొదటినుంచి వెన్నంటి ఉన్న సీనియర్ నేతలు ఇప్పటిదాకా చంద్రబాబు మీద గౌరవంతో తమ పదవులకు త్యాగం చేశారు. అయితే ఇప్పుడు వీళ్ల వంతు వచ్చింది. ఏపీకి సంబంధించి నామినేటెడ్ పోస్టులు 95 ఉన్నాయి. ఇప్పుడు ఈ 95 పోస్టులు భర్తీ చేయవలసిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపైనే ఉంది.
చంద్రబాబుకు కొత్త టెన్షన్
చంద్రబాబుకు ఇప్పుడు కొత్తగా టెన్షన్ వచ్చిపడింది. కూటమిని కూడా కలుపుకుపోవాలంటే నామినేటెడ్ పోస్టులలో కనీసం తమ పార్టీకి 50 శాతం, బీజేపీకి 30 శాతం, జనసేనకు 20 శాతం అయినా ఇవ్వాల్సి ఉంటుంది. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ మళ్లీ తమకు అన్యాయం జరుగుతుందేమోనని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వాస్తవంగా నామినేటెడ్ పోస్టులు ఎన్నికలలో బాగా కష్టపడిన వారికే కట్టబెడుతుంటారు. కార్యకర్తల పనితీరు ఆధారంగా భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన నివేదికలు, రిపోర్టులు తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలి. అది కూడా పార్టీ క్యాడర్ కు సంతృప్తినిచ్చేలా ఉండాలి. ఇప్పుడు మూడు పార్టీలలో అలాంటి నేతల ఎంపికపై కసరత్తు జరుగుతోంది.
ముందుగా పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు, అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు నామినేటెడ్ పోస్టులు దక్కే అవకాశం ఉంది.
వేల సంఖ్యలో అప్లికేషన్లు
క్యాడర్ లో కొందరు ఇప్పటికే తమకున్న రాజకీయ పలుకుబడి, పరిచయాలను ఉపయోగించుకుని పార్టీ అగ్రనేతల రికమెండేషన్ తో ఎలాగైనా నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవాలని ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్లు సమాచారం. మూడు పార్టీల నుంచి వేల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. ప్రస్తుతం టీడీపీ కి సంబంధించి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్క్రూటినీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఫైనల్ గా లిస్టు ప్రిపేర్ అవుతోంది. ఏది ఏమయినా ఫైనల్ డెసిషన్ మాత్రం చంద్రబాబు మాత్రమే తీసుకోనున్నారు. అటు బీజేపీ ఆశావహులు కూడా తమ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కి వినతి పత్రాలు ఇచ్చారు. మొన్నటి ఎన్నికలలో ఎలాగోలా సర్ధుకుపోవాల్సి వచ్చిందని ఈ సారైనా తమకు న్యాయం జరిపించాలని అభ్యర్థిస్తున్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ కు సైతం నామినేటెడ్ పోస్టుల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.
గ్రూపుల భయం
ప్రస్తుతం ఆషాఢమాసం సెంటిమెంట్ ఉండటంతో వచ్చే శ్రావణమాసం లేదా దసరా లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నారు. విడతల వారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండబోతోంది. తొలి విడతలో 25 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్,పురంధేశ్వరి కలిసి సీట్ల సర్థుబాట్లు చేసుకుని ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మూడు పార్టీల క్యాడర్ నుంచి ఈ నామినేటెడ్ పోస్టుల కోసం ఒత్తిడి బాగానే ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా విడతలవారీగా భర్తీచేయబోయే నామినేటెడ్ పదవులు క్యాడర్ లో జోష్ పెంచేవిగా ఉండాలి. మళ్లీ గ్రూపులు కట్టడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటివి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ అగ్ర నేతలపైనే ఉంది. సునామీలా తయారైన నామినేషన్ల భర్తీ ప్రక్రియను ఇప్పుడు ఈ మూడు పార్టీల అగ్రనేతలకు ఛాలెంజ్ గా మారనున్నాయి.