మొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవికి, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ ఫంక్షన్ లో చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. మెగాస్టార్ కామెంట్స్ పై ఏపీ మంత్రులు మండిపడ్డారు. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమరనాథ్ , మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. ఈ వివాద ప్రభావం భోళాశంకర్ సినిమాపై పడింది.
చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళాశంకర్ మూవీ ఈ శుక్రవారం విడుదలకాబోతోంది. థియేటర్లలో టిక్కెట్ రేట్ల పెంపు కోసం భోళాశంకర్ నిర్మాత ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ డాక్యుమెంట్లు అసంపూర్తిగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో తప్ప మరే హీరో మూవీలపైనా ప్రభుత్వం అభ్యంతరాలు తెలపలేదు. అదనపు షోలకు అనుమతులు ఇచ్చింది. తొలి రెండు వారాలు టిక్కెట్లు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. అయితే పిచ్చుకపై బ్రహ్మాస్తంలా సినిమాలపై పడతారేంటని చిరంజీవి వైసీపీ సర్కార్ ను ఉద్దేశించి మాట్లాడటం, ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, ప్రత్యేకహోదా, యువతకు ఉపాధి ఇలాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సలహా ఇవ్వడంపై ఇప్పటికే మంత్రులు ఘాటుగానే బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భోళాశంకర్ మూవీకి ఏపీ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇస్తుందా? టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇస్తుందా? ఈ వివాదం ఇప్పుడు ఏపీలో రచ్చ రగలించేలా ఉంది.
చిరంజీవిపై వైసీపీ నేతలు విమర్శలు చేయగానే మెగాఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తాజాగా గుడివాడలో నిరసన ర్యాలీ చేపట్టారు. కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పుడు భోళాశంకర్ టిక్కెట్ల రేట్ల ఇష్యూ పెనుదుమారాన్ని రేపేలా ఉంది.