APCID : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై వైసీపీ హయాంలో దాడి జరిగింది. ఈ మేరకు నమోదైన కేసులను విచారణ నిమిత్తం తాజాగా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ క్రమంలోనే ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.
సోమవారం ఫైళ్ల అప్పగింత…
ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది. దీంతో వీటిని సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫలితంగా విచారణ ఫైళ్లను సోమవారం సీఐడీకి మంగళగిరి డీఎస్పీ అందించనున్నారు.
చంద్రబాబు నివాసంపైనా దాడి…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2021 అక్టోబర్ 19న వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డట్లు సమాచారం. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు. మరోవైపు చంద్రబాబు నివాసంపైనా మాజీ మంత్రి జోగి రమేశ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్ తదితరులు తమ అనుచరులతో దాడికి పూనుకున్నట్లు తెలుస్తోంది. నందిగం సురేశ్ తోపాటు పలువురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. విచారణ వేగవంతం కోసం కేసులను సీఐడీకి అప్పగిస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
also read : సీఎం చంద్రబాబును కలిసిన చిరంజీవి.. అందుకేనా?