AP Flood Victims Compensation Distribution: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడంతో వరదలకు దారితీశాయి. రాష్ట్రంలో వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం సాయం అందించింది.
అయితే, ఇప్పటికే వరదల్లో సర్వం కోల్పోయన బాధితుల్లో దాదాపు 98శాతం మందికి ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద నష్ట బాధితులకు సోమవారం వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపింది.
పరిహారం అందించిన 98 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.584కోట్లు ప్రభుత్వం జమ చేయగా.. మరో రూ.18కోట్లు అందించాల్సి ఉంది. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వారిలో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే ఆ బాధితుల ఖాతాలకు సంబంధించి మళ్లీ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సరి చేశారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో కొందరికి నగదు జమ కాలేదు. ప్రస్తుతం ఈ బాధితులందరికీ సోమవారం సాయంత్రానికి వరద సాయం వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం వీరి ఖాతాల్లో రూ.18.69 కోట్లను డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Also Read: అస్సలు అర్థం కావడం లేదు.. ఏమీ తోచడం లేదు.. ఆ ప్యాలెస్ పై మంత్రి కామెంట్
ఇదిలా ఉండగా, వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తప్పనిసరిగా సాయం అందించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 15వేల కుటుంబాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,620 కుటుంబాలు, ఇతర జిల్లాల్లోని పలువురు బాధితులకు నిధులు పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.