Elephants Attack on Farmers: ఏపీలో ఏనుగుల దాడులు అధికమవుతున్నాయి. ఏనుగుల వరుస దాడులకు రైతులు బలి అవుతున్నారు. ఏనుగుల కట్టడి కోసం కుంకీ ఏనుగులు తెప్పిస్తున్నామంటూ డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించి నెలలు గడుస్తున్నా.. కుంకీలు ఇంకా రాష్ట్రానికి రానేలేదు. ఏనుగుల దాడికి ఇంకెన్ని రైతుల ప్రాణాలు బలి అవుతాయి? రాష్ట్రంలో ఉన్న రెండు కుంకీ ఏనుగుల సంగతేంటి? ఇప్పుడు సామాన్యుల్లో ఎన్నో ప్రశ్నలు..
ఏపీలో ఏనుగుల దాడులతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగుతోంది. రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో పార్వతీపురం మన్యం జిల్లా వన్నం గ్రామం ఏనుగుల దాడిలో శివుడు నాయుడు అనే రైతు మృతి చెందగా.. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో తన మామిడి తోటకు కాపలా ఉన్న రాజారెడ్డి అనే రైతు మృతి చెందాడు. అయితే, ఏనుగుల కట్టడికి ఫారెస్ట్ అధికారుల చర్యలు మాత్రం తూతూ మంత్రాగానే ఉంటున్నాయి. రైతు రాజారెడ్డిని తొక్కి చంపిన ఏనుగుల ఘటనతో ఫారెస్ట్ అధికారులపై పీలేరు మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏనుగుల మూలంగా ఇప్పటికే పదుల సంఖ్యలో రైతులు చనిపోయారు.
గజరాజుల బీభత్సం నుంచి తమను కాపాడాలని ఏపీలోని ఏనుగుల బాధితులు ప్రభుత్వానికి.. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు మోర పెట్టుకున్నారు. దీంతో ఏపీలో ఏనుగుల బీభత్సవాన్ని అరికట్టేందుకు కుంకీ ఏనుగుల కోసం ఆగస్టులో కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు పవన్ కల్యాణ్. అందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా అంగీకరించిందని.. ఇందు కోసం డిప్యూటీ సీఎం, కర్ణాటక మంత్రి ఈశ్వర్ మధ్య ఎంఓయూ ఒప్పందం జరిగిందని ప్రకటించారు కూడా. కుంకీ ఏనుగులతో ఏనుగుల దాడులను అరికట్టవచ్చునని త్వరలోనే కుంకీలను రాష్ట్రానికి తీసుకొస్తామని ఆ మధ్య పవన్ ప్రకటించారు.
Also Read: 48 గంటల్లోనే అత్తా కోడళ్లపై అత్యాచారం నిందితులను అరెస్ట్ చేశాం : హోంమంత్రి అనిత
కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక మంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నామని పవన్ ప్రకటించి నెలలు గడుస్తున్ననా.. ఇప్పటి వరకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రాష్ట్రానికి రాలేదు. ఇంతకీ కుంకి ఏనుగులు రాష్ట్రానికి ఎప్పుడొస్తాయి? కర్ణాటకతో డిప్యూటీ సీఎం పవన్ కుదుర్చుకున్న ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు వచ్చేలోపు ఏనుగుల దాడులకు ఇంకెన్ని ప్రాణాలు పోవాలి? కర్ణాటక నుంచి కుంకీలు వచ్చేదాక వేచి ఉండకుండా.. ప్రస్తుత తక్షిణ చర్యగా మన రాష్ట్రంలో ఉన్న రెండు కుంకి ఏనుగులను ఎందుకు వినియోగించుకోవడం లేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. స్వయంగా అటవీ శాఖను కూడా చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఏనుగుల మూలంగా బలి అవుతున్న రైతులు, సామాన్య ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల శివారు ప్రాంతాల్లో ఏనుగుల మూలంగా కోల్పోతున్న రైతుల ప్రాణాలు.. క్షణక్షణం భయం భయంగా బతుకుతున్న సామాన్య ప్రజలకు ఏపీ ప్రభుత్వం సత్వరమే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కుంకీల కోసం వేచి చూస్తూ మరిన్ని ప్రాణాలను బలి తీసుకోకుండా.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనితీరును మెరుగు పరిచి.. అధునాతన టెక్నాలజీతో ఏనుగులను, క్రూర మృగాలను అడవికే పరిమితం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఏపీలో ఏనుగుల మూలంగా చనిపోయే రైతుల పరిస్థితి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తే.. రాష్ట్ర ప్రతిష్ఠ మరింత దిగజారే ప్రమాదముందని ప్రభుత్వం గమనించాలి. మరి ప్రభుత్వం, ఫారెస్ట్ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం ఏనుగుల పీడిత జిల్లాలకు ఎప్పుడు, ఎంతవరకు న్యాయం చేయగలరనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.