AP Elections 2024: సీటు ఉంటుందా, ఊడుతుందా? నియోజకవర్గం బదిలీనా, అసలుకే ఎసరా? వైసీపీ నేతల్లో ఇప్పుడిదే టెన్షన్. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల నేతలతో సీఎం జగన్ నేరుగా చర్చలు జరిపారు. ఇన్ఛార్జుల మార్పుపై నేతలకు వివరించారు. త్వరలో రాయలసీమ అభ్యర్థులను మార్చనున్నారు.
అధికార పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. సీటు మారుస్తారన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ప్రజల్లో ఎవరిపై వ్యతిరేకత ఉందో.. సర్వేలు చేయించిన జగన్మోహన్ రెడ్డి.. ఆ నివేదికలను అభ్యర్థుల ముందు ఉంచుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మార్పు, తదితర అంశాలపై ఎమ్మెల్యేలతో స్వయంగా చర్చిస్తున్నారాయన. నేతల అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఇన్చార్జులను ఖరారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో నేతలకు స్పష్టత ఇస్తున్నారు.
పలుచోట్ల అభ్యర్థులను మార్చాలన్నది సీఎం జగన్ అభిప్రాయం. ఇప్పటికి 11 నియోజకవర్గాల్లో ఆ పని చేశారు. మరికొన్ని మార్పులపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం నుంచి పిలుపు వచ్చింది. మంత్రులు విశ్వరూప్, జయరాం సీఎంను కలిశారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డితో సీఎం చర్చలు జరిపారు.
మంత్రులు ఉషశ్రీచరణ్, శంకరనారాయణ, విశ్వరూప్.. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, నరసాపురం ఎమ్మెల్యే-విప్ ప్రసాదరాజు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వర్రావు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా సీఎంవోకు వచ్చి పార్టీ ముఖ్యులతో మంతనాలు జరిపారు. కొంతమందికి సీటు ఇవ్వడం కుదరదని, అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పినట్లు సమాచారం. అటు.. గోదావరి జిల్లాల నేతలతో సీఎం చర్చలు కంటిన్యూ చేశారు. కొందరు ఆశావహులనూ పిలిపించారు. రెండు రోజుల్లో పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలను ఖరారు చేస్తారని తెలుస్తోంది.
జగన్ పిలిపించి మాట్లాడుతున్నా.. వైసీపీలో టికెట్ల పంచాయితీ ముదిరింది. విజయవాడ వెస్ట్లో వెలంపల్లి శ్రీనివాసరావుకి మొండి చేయి చూపిస్తారని ప్రచారం జరుగుతుండగా.. సెంట్రల్ నుంచి బరిలో నిలుపుతానని జగన్ చెప్పినట్లు సమాచారం. లేనిపక్షంలో మళ్లీ అధికారంలోకి వచ్చాక మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణుకు సీట్ కన్ఫర్మ్ అవలేదని సమాచారం. విష్ణు స్థానంలో ఓ ప్రముఖ కళాశాల అధిపతిని రంగంలోకి దించనున్నారని చెప్తున్నారు. టికెట్ దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు జగన్. అటు రాయలసీమ ఎమ్మెల్యేలతో ఎంపీ మిథున్రెడ్డి కూడా చర్చలు జరుపుతున్నారు.