AP Elections 2024: త్వరలో ఏపీలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ఉమ్మడిగా బరిలో దిగనున్న టీడీపీ జనసేన మధ్యే నువ్వా నేనా అన్న రేంజ్లో పోటీ ఉంటుందనుకున్న తరుణంలో.. తాను పోటీకి సిద్దమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించి ఏపీ పాలిటిక్స్లో మరింత హీట్ పెంచారు. చీకటిలో ఉన్న రాష్ట్రంలో వెలుగుల నింపడానికే పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన ఆయన.. జై భారత్ నేషనల్ పార్టీతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటానన్న ధీమాలో ఉన్నారు.
జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన అధికారానికి ఏనాడో గుడ్బై చెప్పిన ఆయన.. ఏ పార్టీలో చేరుతారోనన్న ఉత్కంఠను రేకెత్తించారు. తానే కొత్త పార్టీ పెడతారన్న అంచనాలు కూడా ఉన్న నేపథ్యంలో సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీ పేరును ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని మరింత పెంచారు. జాతీయ జెండా రంగులు, తన ఫొటోతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధనతోపాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నది తన లక్ష్యమని తెలిపారు జేడీ. ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలమంటున్న ఆయన.. ఎవరితో పొత్తు లేకుండా 175 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామన్న జేడీ.. పార్టీ పేరుతో వెబ్సైట్ కూడా ప్రారంభించారు. కాగా.. ఏపీలో ఇప్పటికే తెలుగు సేన పార్టీతోపాటు జేడీ ప్రకటించిన కొత్త పార్టీతో వలసలపై ఉత్కంఠ నెలకొంది. జనసేన నుంచి ఎక్కువగా వలసలుండే ఛాన్స్ ఉందన్న వార్తలు జోరందుకున్నాయి.
మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీ నారాయణ డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్ పై వెళ్లి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డీఐజీగా 2006 జూన్లో సొంత రాష్ట్రమైన హైదరాబాద్లో విధుల్లో చేరారు. ఆ తర్వాత సీబీఐ జాయింట్ డైరెక్టర్గా సంచలన కేసుల్లో దర్యాప్తు చేపట్టి కీలకంగా వ్యవహరించారు. పలు కీలక కేసుల దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత సీబీఐ జేడీగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత జనసేనలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత జనసేన వీడటంతో జేడీ ఏ పార్టీలో చేరుతారన్న ఉత్కంఠ నెలకొనగా.. తాజాగా కొత్త పార్టీని ప్రకటించి ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచారు.