ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కసరత్తు మొదలుపెట్టింది. 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు కూడా ఎన్నికలు జరిగాయి. దీంతో వచ్చే ఏడాది జూన్ 10వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఏపీలో పర్యటనకు రెడీ అయ్యారు.
ఇప్పటికే సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా.. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్లతో కూడిన ఏడుగురు సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఈ బృందం పర్యటించనుంది. 2024 ఓటర్ల జాబితాల రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై అధికారులు సమీక్షించనున్నారు.
ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విడివిడిగా సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈరోజు 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుండగా.. 23న 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అవుతారు. జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సమస్యాత్మక ప్రాంతాలు, పోలీస్ సిబ్బంది వంటి అన్ని అంశాలపై చర్చించనున్నారు. అలానే 23వ తేదీ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ఎన్నికలకు సంబంధించిన అధికారులకు.. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశంలోనే ఓటర్ జాబితాపైనా అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది. అయితే ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లపై అధికార.. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు ఫిర్యాదులు చేశాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్కు సైతం వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వీటి గురించి కూడా అధికారుల బృందం చర్చించనున్నట్లు సమాచారం.