Ap Election Commissioner : ఓటర్ల తుది జాబితా రూపకల్పన కోసం 2023 డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి 12లోపు పరిష్కరిస్తామన్నారు. గందరగోళం లేకుండా ఓటరు జాబితాను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు.
మృతి చెందిన ఓటర్లను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు. అలాంటి వారిని ఓటర్ల జాబితా నుంచి తీసివేస్తామని తెలిపారు. డూప్లికేట్ కేసులను పరిష్కరిస్తామన్నారు. ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించామని ముకేశ్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 పేర్లను అనర్హులుగా తేల్చామన్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. కాకినాడ నగరంలో ఫాం 7 ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మందిని గుర్తించామన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశ పూర్వకంగా దాఖలు చేసిన ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముకేశ్ కుమార్ వెల్లడించారు.
చంద్రగిరి నియోజకవర్గంలో ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్ వోలపై చర్యలు తీసుకున్నామని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. వారిపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. పర్చూరులో 10 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. జీరో డోర్ నంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేశామన్నారు.
అసంపూర్తిగా ఉన్న ఓటర్ల జాబితాను పూర్తిగా సవరించినట్లు ఆయన వెల్లడించారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలు విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదయ్యాయని ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముకేశ్కుమార్ మీనా వివరించారు.