Deputy CM Pawan Kalyan Fires on Prakash Raj: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడ దుర్గగుడి సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు. ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గత టీటీడీ పాలకులు, ప్రభుత్వ పాలకులపై విరుచుకుపడ్డారు. ఎవరి ఇష్టానుసారం వాళ్లు మాట్లాడినా, సనాతన ధర్మం జోలికి వచ్చినా వాళ్లను వదిలేది లేదన్నారు. తాము ఏదీ మరచిపోలేదని, సమాజాన్ని కాపాడాలనుకునే వ్యక్తులమే కాని.. విడదీసే వ్యక్తులం కాదన్నారు పవన్.
మాజీ ఈఓ ధర్మారెడ్డి ఈరోజు వరకూ కనిపించలేదని, ఆయన సనాతన ధర్మాన్ని పాటించలేదని ఆరోపించారు. బిడ్డ చనిపోతే 11 రోజులు ఆలయంలోకి రాకూడదని ఆ మాత్రం తెలియదా అని పవన్ ప్రశ్నించారు. తాను తిరుమలకు వచ్చినపుడు ఎవరెలా ప్రవర్తించారో అన్నీ గుర్తున్నాయన్న పవన్.. మక్కాకు వెళ్లి చూస్తే ఎంత పవిత్రంగా ఉండాలో తెలుస్తుందన్నారు. ఇస్లాంలను చూసి నేర్చుకోవాలని, మక్కాకు వెళ్లిన పిల్లాడి నుంచి పెద్దల వరకూ వాళ్లెంతలా గౌరవిస్తారో చూస్తే తెలుస్తుందన్నారు. మాజీ ఈఓ ధర్మారెడ్డి విచారణకు సిద్ధం కావాలని సూచించారు.
తాము ఎవరి సెంటిమెంట్లతోనూ ఆడుకోవడం లేదన్న పవన్.. పొన్నవోలు సుధాకర్ రెడ్డివి మదమెక్కిన మాటలని విమర్శించారు. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని, ఇది సమంజసం కాదన్నారు. హిందువులు సున్నితులు కాబట్టి ప్రకాష్ రాజ్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అయ్యప్పస్వామి, సరస్వతి దేవి, ఇప్పుడు తిరుమల లడ్డూ.. ఇలా హిందువుల విషయాలపైనే ఆయన విమర్శలు చేయడం తగదన్నారు. ఇస్లాం గురించి ఇలా మాట్లాడినా, వారిపై దాడులు చేసినా.. వాళ్లంతా కలిసికట్టుగా వచ్చి పోరాడుతారని పవన్ తెలిపారు.
Also Read: టీటీడీ ఆస్తులు, ఆభరణాల సంగతేంటీ? జగన్ టీమ్పై సందేహాలు.. చంద్రబాబుకు పవన్ లేఖ!
తిరుమల లడ్డూ విషయంలో తనపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫైరయ్యారు. లడ్డూ వ్యవహారంలో జోకులేస్తే ఊరుకోబోమన్నారు. సెక్యులరిజం అంటే టూ వే అని, వన్ వే కాదని గుర్తు చేశారు. తమ మనోభావాలను రెచ్చగొట్టేలా మాటలాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి.. తమ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటే తనతో సహా కుటుంబమంతా నాశనమైపోతారని, రక్తం కక్కుకుని చస్తారని ప్రమాణం చేశారని, మున్ముందు మీకు జరిగేది అదేనన్నారు. కల్తీ వ్యవహారంలో ఆయన్ను కూడా విచారిస్తామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. నా మతాన్ని ప్రేమించి, పరమతాలను గౌరవించాలని తాను నేర్చుకున్న విధానమని పేర్కొన్నారు.
వైవీ సుబ్బారెడ్డి టీటీడీ రికార్డులు అడుగుతున్నారని, గత పాలకులు ప్రతిపక్షానికి రికార్డులు, లెక్కలు చూపించారా ? అని ప్రశ్నించారు. మౌనంగా ఉన్నామంటే దానికి అర్థం బాధలేదని కాదని, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నామన్నారు. తాను సనాతన ధర్మానికి కాపాడేందుకు పోరాటానికి సిద్ధమైతే.. దేశంలో ఆపేవారు ఎవ్వరూ లేరన్న పవన్.. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను విడిచేందుకు కూడా వెనుకాడనన్నారు.
సినీ అభిమానులు.. తమ హీరోల సినిమాలు వస్తే చూడటానికి వెళ్లినట్లే.. ధర్మాన్ని కాపాడేందుకు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు పవన్. తాను కూడా హీరోనే అన్న ఆయన.. హీరోల సినిమాలను చూడటం, హీరో కనిపిస్తే ఎత్తడం కాదని, ఇప్పుడు ధర్మం కోసం నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు.