Gaddar: ఈ రోజు ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ తొలి వర్ధంతి. గద్దర్తో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు సత్సంబంధం కొనసాగింది. గద్దర్ తొలి వర్ధంతి సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. గతంలో ఆయనను కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.
గద్దర్ పోరాట స్ఫూర్తిని మరిచిపోలేమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పీడిత వర్గాల గొంతుకగా నిలిచారని వివరించారు. తన పాటనే అస్త్రంగా చేసుకుని ప్రజా పోరాటాల్లో అధ్యాయాన్ని లిఖించుకున్నారని తెలిపారు. గద్దర్ వర్ధంతి రోజున ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకూ గద్దర్ పాటతో చైతన్యాన్ని రగిలించారని వివరించారు.
Also Read : ఇంకా థర్డ్ డిగ్రీలు ఏంటీ? బుద్ది ఉందా?: షాద్ నగర్ ఘటనపై ఆకునూరి మురళి
పాటనే తూటాలుగా మలచి తను నమ్మిన సిద్ధాంతాన్ని, అలాగే, ప్రజల కష్టాలను తన రచనతో, తన గానంతో ఎలుగెత్తి చాటారని డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు కురిపించారు. బడుగు బలహీనవర్గాల కోసం తుదిశ్వాస వరకు పోరాడారని తెలిపారు. నెల్లూరు టౌన్ హాల్లో గద్దర్ను తొలిసారి కలిసినట్టు గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి చివరిదాకా ఆయనతో అనుబంధం కొనసాగిందని తెలిపారు. గద్దర్ పేరు తలుచుకోగానే కాలికి గజ్జెకట్టి ఆడిపాడిన పాట గుర్తుకు వస్తుందని వివరించారు. ప్రజల పాట బతికినంత కాలం గద్దర్ పేరు నిలిచే ఉంటుందని నమ్మకంగా పేర్కొన్నారు.