Deputy CM Speech in Mysuravaripalli : దేశానికి వెన్నెముక పంచాయితీ రాజ్ వ్యవస్థ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లిలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, స్వర్ణ పంచాయతీల ఏర్పాటే అందరి లక్ష్యమని తెలిపారు. స్త్రీ శక్తికి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే నిదర్శనమని కొనియాడారు.
గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి ఎదిగారన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు చాలా కీలకమన్న పవన్ కల్యాణ్.. రాజస్థాన్ తర్వాత పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది సర్పంచ్ లు వైసీపీవాళ్లే ఉన్నారని, వారంతా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కృషి చేయాలని సూచించారు. తాను పార్టీ కోసం వ్యక్తుల్ని పోగొట్టుకునే వ్యక్తిని కానన్నారు.
గత ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద 41 వేల కోట్ల రూపాయల్ని ఖర్చు చేశామని చెప్పిందని, కానీ కేవలం రూ.15 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. మిగతా రూ.26 వేల కోట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల సగటు అవసరాలు తీరలేదని, మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. తనకు సినిమాలు వేరు, రాజకీయాలు వేరని చెప్పిన పవన్.. సినిమాకంటే సమాజం, గ్రామాలో ముఖ్యమని పేర్కొన్నారు.
Also Read: “చంద్రబాబు మాటలు విని షాకయ్యా.. మా హయాంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది”
తనకు అన్నాహజారే అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి ఆయన గురించి తెలుసుకుంటూ పెరిగానని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఒక సర్పంచ్ గా ఉన్న ఆయన.. దేశ రాజకీయాల్నే మార్చేశారన్నారు. లోక్ పాల్ బిల్లు, సమాచారహక్కు తట్టం ఆయన నాయకత్వంలోనే వచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 13,326 పంచాయతీలు ఉన్నాయని, అందరూ ఐకమత్యంతో పనిచేసి.. బలోపేతం అయితే.. ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నా తీర్చివేయవచ్చని తెలిపారు.
ప్రత్యేకించి మైసూరవారిపల్లి గ్రామసభకు రావడానికి ఒక కారణం ఉందన్నారు. ఉద్యానవనపంటల రాజధాని మైసూరవారిపల్లి అని.. ఇక్కడ నేలపై పండిన వాటి రుచే వేరన్నారు. ఆ క్రెడిట్ అది ఒక్క రాయలసీమ జిల్లాలకే సొంతమన్నారు. రాయలసీమను చూస్తే అందరూ భయపడతారు కానీ.. ఇది చదువుల నేలన్నారు. కోస్తా జిల్లాల కంటే.. రాయలసీమలోనే ఎక్కువ గ్రంథాలయాలున్నాయని తెలిపారు. ఇక్కడి యువతకు తెగింపు ఎక్కువ అని, ఆ విషయం సుగాలి ప్రీతి సమస్య వచ్చినపుడే చూశానన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఉన్న తాము బాధ్యతల నుంచి పారిపోవడం లేదన్నారు. అద్భుతాలు చేయడానికి తమ చేతిలో మంత్రదండమేమీ లేదని, అన్నింటినీ అధిగమించే గుండెబలం మాత్రం ఉందన్నారు. తనకు ప్రజాదరణ ఉంది కానీ.. పరిపాలన అనుభవం లేదని, అందుకే అనుభవజ్ఞ్నుడు అయిన చంద్రబాబు నుంచి నేర్చుకోవాలని కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. కోట్లాది మంది ప్రజలకు ఒక నాయకుడు సరిపోడని, నాయకుల సమూహం కావాలన్నారు. ప్రజలకు కష్టం వస్తే అండగా నిలబడుతానని హామీ ఇచ్చారు.