Manickam Tagore: ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాకూర్ మూడు రోజుల ఏపీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్లో చేరిక తర్వాత ఆమెకు అప్పగించే పార్టీ బాధ్యతలపై విస్తృతంగా చర్చలు జరుపుతోంది కాంగ్రెస్. ఈ మేరకు పలువురు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి నాయకుల అభిప్రాయాలను సేకరించారు మాణిక్యం ఠాకూర్. ఈ నివేదికను ఇవాళ ఢిల్లీ అధిష్టానానికి వివరించనున్నారు. కాగా.. ఈ రెండు మూడు రోజుల్లోనే ఏపీపీసీసీ చీఫ్గా షర్మిలను ప్రకటించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నెల 18న కాంగ్రెస్ ఏపీ అధ్యక్షరాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. అయితే.. షర్మిలకు పీసీపీ పగ్గాలు ఇవ్వొందంటూ వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.
కర్ణాటక, తెలంగాణలో విజయదుందుబి మోగించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 10 ఏళ్లనాటి పూర్వ వైభవం తీసుకురావాలని.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించి అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు వ్యూహాలకు పదునుపెట్టి ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్లో వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించి ఆమె సోదరుడైన జగన్ను ఓడించి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎత్తుగడలు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.