YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ తాజాగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మొన్నటికి మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నేరుగా సీఎం చంద్రబాబుకు.. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి రాసిన లేఖనే పంపించి తనదైన స్టైల్ లో విమర్శించారు. ప్రవేటీకరణ అడ్డుకోకుంటే కూటమి నుండి టీడీపీ, జనసేన బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఇలా ఇటీవల తనదైన శైలిలో కూటమి ప్రభుత్వానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు.
తాజాగా కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి.. పలుమార్లు మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యంపై రవాణా శాఖ మంత్రి పలు ప్రకటనలు సైతం చేశారు.
దీనితో ఏపీలో తెలంగాణ మాదిరిగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం రానుందని ముమ్మర ప్రచారం సైతం సాగింది. దసరా కానుకగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రకటిస్తారని ప్రజలు ఆశించారు. అయినా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో.. షర్మిళ తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
శుక్రవారం విజయవాడ నుండి తెనాలికి వెళ్లేందుకు షర్మిళ ఆర్టీసి బస్ ఎక్కారు. మహిళలు టికెట్ తీసుకోవాల్సిందేనా అంటూ కండక్టర్ ను ప్రశ్నించారు. టికెట్ కొనుగోలు చేయాలని షర్మిళను కోరగా, తెనాలి వరకు టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ఆర్టీసీ బస్సులోనే పోస్టుకార్డును చేతబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి పంపించాలన్నారు.
అలాగే బస్సులోని మహిళలను సైతం టికెట్ కొనుగోలు చేశారా అంటూ ప్రశ్నించి, అందరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. ఇలా షర్మిళ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇటీవల విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పని అయిపోయిందంటూ మొన్నటి వరకు ఏపీలో రాజకీయ పార్టీలు భావించిన తరుణంలో.. షర్మిళ పార్టీ పగ్గాలు చేపట్టి పొలిటికల్ కామెంట్స్ తో స్పీడ్ పెంచారు. దీనితో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకురావడమే షర్మిళ లక్ష్యంగా కనిపిస్తోంది.