Early elections in AP(Latest political news in India) : ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు చాలా ముందుగా ఎన్నికల నగారా మోగించేస్తున్నాయనే చెప్పాలి. మళ్లీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీకి రానని శపథం చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాల్లో యాక్టివ్గా వుండేందుకు జిల్లాల పర్యటనలు ఎంచుకున్నారు. ప్రాజెక్టుల సందర్శనతో హీట్ రాజేస్తున్నారు. సీఎం జగన్కు పెట్టని కోట పులివెందులకు వెళ్లి.. వై నాట్ పులివెందుల అంటూ నినదించారు చంద్రబాబు. అటు లోకేశ్ యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలో సాగుతోంది. తెలుగు చరిత్రలో సుదీర్ఘ కాలం, సుదూరం కొనసాగిన పాదయాత్రగా యువగళం నిలిచిపోయేలా ఉంది.
ఇక జనసేన కూడా చాలా ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో జూన్ లోనే జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఆగస్టు 10 నుంచి మూడో విడత యాత్ర ఉంటుందని ప్రకటించి కేడర్లో జోష్ పెంచారు. మరోవైపు బీజేపీ.. ఏపీ అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కూతురు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని నియమించింది. సీఎం జగన్పై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారామె.
రాష్ట్రంలో విపక్షాల హడావిడి పెరగడంతో అధికార పార్టీ కూడా మెల్లగా ఎన్నికల దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. నియోజకవర్గాల పరిశీలకులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అవడం అధికార పార్టీ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించినట్లు కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు, అంతర్గత కలహాలపై దృష్టి పెట్టి, అంతా ఒక్క తాటి మీదకు తీసుకు వచ్చేందుకే సజ్జల రంగంలోకి దిగారు. వైనాట్ 175 అన్నది సీఎం జగన్ నినాదం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను గెలుచుకునేలా వ్యూహరచన, కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా అన్ని సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితిని ఇన్డెప్త్గా తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు.
గత ఏడాది కాలంలో రెండు, మూడు విడతలుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సంస్థతో సర్వే చేయించినట్లు సమాచారం. వాళ్ల లెక్కల ప్రకారం 151 సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 40 మంది పనితీరు బాగాలేదని తేలింది. దీంతో ఆ ఎమ్మెల్యేలతో స్వయంగా భేటీ అయ్యారు జగన్. సెప్టెంబర్ దాకా టైమిచ్చి, పనితీరు మెరుగుపరచుకోవాలని హితవు పలికారు. ఇంతలో సజ్జల 175 నియోజకవర్గాల పరిశీలకులతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయడం, ఇంకోవైపు సజ్జల పార్టీ పరిస్థితిని చక్కదిద్దే పని మొదలుపెట్టడం చూస్తుంటే.. ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ మొదలైంది. అలాంటిదేమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు గట్టిగానే చెబుతున్నారు. ఐనా.. సీఎం జగన్ వ్యూహాల్ని అంచనా వేయడం కష్టమని భావిస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన.. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా రెడీగా వుండాలని జాగ్రత్త పడుతున్నారు.