CM Jagan : చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవన్నారు. కక్షతో ఆయనను అరెస్ట్ చేయించలేదని స్పష్టం చేశారు. నిజానికి చంద్రబాబును అరెస్ట్ చేసినపుడు తాను ఇండియాలోనే లేనని, లండన్ లో ఉండగా చంద్రబాబు అరెస్ట్ అయ్యారని గుర్తుచేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీనే ఇదంతా చేసిందని ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలితో సహా.. కేంద్రంలో సగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గతంలో కూడా చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేశారని, అప్పటికే కేంద్రం వద్ద చంద్రబాబు అవినీతికి సంబంధించిన ఆధారాలున్నాయని జగన్ తెలిపారు. ఆ సమయంలో తాము ప్రతిపక్షంలో ఉన్నామని, మోదీకి , కేంద్రానికి చంద్రబాబు గురించి అన్నీ తెలుసు కాబట్టే.. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ వారిని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్మిషన్ ను కూడా విత్ డ్రా చేశారని దుయ్యబట్టారు.
టీడీపీ అధికారంలో ఉండగానే.. చంద్రబాబు అవినీతిపరుడని స్పష్టమైందన్నారు. అప్పట్లో ఇన్ కం ట్యాక్స్ అధికారులు కూడా చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. అలాగే ఈడీ కూడా చంద్రబాబు చేసిన అక్రమాలను బయటపెట్టిందన్నారు. కేంద్రంలో ఉన్న ఇన్ కం ట్యాక్స్, కేంద్రంలో ఉన్న ఈడీ ఆయన అవినీతిని నిరూపించిందన్నారు. ఇన్ని అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలున్నా.. చంద్రబాబును, వీరప్పన్ లాంటి వారిని అరెస్ట్ చేయకూడదా ? అని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును తానేమీ కక్షగట్టి అరెస్ట్ చేయించలేదని, అంతా మోదీనే చేయించారంటూ సీఎం జగన్ ట్విస్ట్ ఇచ్చారు.