YCP Incharges : వైఎస్ఆర్సీపీ ఇన్ చార్జ్ల మార్పుపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. సీఎం జగన్ పిలుపుతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్లకు పిలుపు వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై సీఎం జగన్ వారితో చర్చించారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇంచార్జీలను ఖరారు చేయనున్నారు. మరోవైపు సీఎం కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రావడం చర్చనీయాంసమైంది. గిద్దలూరు సహా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇంచార్జీల మార్పుపై సీఎంతో చర్చించనున్నారు బాలినేని.
ఏపీలో మార్పులు చేర్పులతో వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఎవరి సీటుకు ఎసరు పడుతుందో తెలియని పరిస్థితితో ఆందోళనలో ఉన్నారు. లోపల అసంతృప్తి ఉన్నా సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు. సీఎంవో నుంచి పిలుపు రావడంతోనే తాను ముఖ్యమంత్రిని కలిశానన్నారు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులు, నిధుల గురించి చర్చించానని తెలిపారు.