CM Chandrababu: ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో అడుగుపెట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం ఫలికారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు ఎన్టీఆర్ భవన్ వద్దకు రావడంతో పరిసర ప్రాంతాల వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు నేతలు సీఎంకు పూల బొకేతో స్వాగతం పలికారు.
ఇక నుంచి తరుచూ చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. భవిష్యత్తులో సీఎం పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. జిల్లాలోని పార్టీ కార్యాలయాలను సైతం సందర్శించాలని మంత్రులు, నేతలను ఇదివరకే సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Also Read: తెలంగాణలో ఏపీ మాజీ సీఎం జగన్కు బిగ్ షాక్.. లోటస్ పాండ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
నాకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు.. ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. సచివాలయంలో వినతుల స్వీకరణ ఎలా చేయాలి అనే అంశంపై ఆలోచిస్తున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. పోలవరం సందర్శనతోనే తన క్షేత్ర స్థాయి పర్యటన ప్రారంభం అవుతుందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు.