New Industrial Policy: ఏపీలో చంద్రబాబు సర్కార్ కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్లేస్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడం, యువతకు ఉపాది అందించడమే దీని లక్ష్యం.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై పాలసీని తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని రెడీ చేసింది. సోమవారం సచివాలయం లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు.
పరిశ్రమలు కల్పించే ఉపాధి ఆధారంగా ప్రొత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు ఎస్క్రో ఖాతా ద్వారా పారిశ్రామిక వేత్తలకు ప్రొత్సాహకాలు చెల్లించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల కంపెనీ లకు సకాలంలో ప్రొత్సాహకాలు అందుతాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
ఎంతమందికి ఉపాధి కల్పిస్తే ఎంత మేరా ప్రొత్సాహకాలు ఇస్తారనే దానిపై నూతన పాలసీలో క్లారిటీ ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే చాలా రాష్ట్రాలు మూలధన పెట్టుబడిలో కంపెనీలకు కొంత ప్రొత్సాహకాల కింద ఇస్తున్నాయి. ఈ తరహా కంటిన్యూ చేస్తూనే, ఉపాధి ఆధారంగా అదనంగా ఇవ్వాలన్నది ఆలోచన.
ALSO READ: ఢిల్లీ ఎయిర్పోర్టులో సజ్జలకు కష్టాలు.. అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు, ఎందుకు?
ఉత్పత్తి మొదలుపెట్టిన తర్వాత విద్యుత్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, లోకల్ ప్రొక్యూర్మెంట్ వంటి సబ్సిడీలు ఇవ్వాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్. దీనివల్ల పెద్ద పరిశ్రమలే కాకుండా చిన్నవాటిని ప్రొత్సహించడం అవుతుందని అంచనా వేస్తోంది.
వచ్చే కేబినెట్ ముందుకు కొత్త పారిశ్రామిక విధానం పాలసీని తీసుకురావాలన్నది చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అందులో పొందుపరచనున్నారు. దాదాపు మూడునెలలుగా దీనిపై కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.