AP Assembly Elections Results(Andhra pradesh today news): ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై 21 రోజుల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఇంకా కొద్ది గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో, వైసీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుందో లేక కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అన్న ప్రశ్నలకు సమాధానం రాబోతోంది. ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్లను లెక్కిస్తారు. తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం స్థానాల నుంచి వెల్లడికానుంది. ఇక్కడ 13 రౌండ్లలోనే ఫలితాలు రానున్నాయి. భీమిలి, పాణ్యం ఫలితాలు మాత్రం ఆలస్యం అవుతాయని ఈసీ తెలిపింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకై రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 350 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఈసీ. వీటిలో 75 సెంటర్లను పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు కేటాయించింది. సమస్యాత్మక జిల్లాలు, ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. కౌంటింగ్ సెంటర్లను రెడ్ జోన్ గా పేర్కొంది. మొత్తం 90 వేల మంది సిబ్బంది కౌంటింగ్ లో ప్రక్రియను నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. సుమారుగా 60 వేల మంది సివిల్ పోలీసులు, 8 వేల మంది సాయుధ బలగాలను, మరో 20 వేల మంది సిబ్బందిని ఈసీ రంగంలోకి దించింది.
ఏపీ పోలీసులతో పాటు.. కర్ణాటక పోలీసులు, తమిళనాడు పోలీసులు సైతం బందోబస్త్ లో ఉన్నారు. ఏపీ పోలీసులు 45,960 మంది కర్ణాటక పోలీసులు 3500 మంది, తమిళనాడు నుంచి 4500 మంది పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్త్ కు వచ్చారు. వీరితో పాటు 1622 మంది హోంగార్డులు, 3366 మంది ఇతర పోలీస్ సిబ్బంది బందోబస్త్ లో ఉన్నారు. వీరికి తోడుగా మరో 18,609 మందిని ఈసీ మోహరించింది. వీరిలో 3010 మంది ఎన్ సీసీ, 13,739 మంది ఎన్ఎస్ఎస్ సిబ్బంది, 1614 మంది ఎక్స్ సర్వీస్ మెన్, 246 మంది రిటైర్డ్ పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. వైసీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద, వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ఇళ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఆయా ప్రాంతాలకు బలగాలను మోహరించారు.
కాగా.. 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందని, సాయంత్రం 5 గంటల్లో ఫలితం వస్తుందని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అలాగే 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21-24 రౌండ్లలో ఫలితాలు వస్తాయని, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 కంటే ఎక్కువ రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందని, వీటి ఫలితాలు ఆలస్యం కావొచ్చునని తెలిపారు. మధ్యాహ్నం 1 గంట కల్లా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఒక స్పష్టత రానుంది.
వైసీపీ మళ్లీ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుండగా.. కూటమి గెలుపే ఖాయమంటున్నారు అభ్యర్థులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైసీపీ, కూటమి పార్టీల నేతలతో సందడి వాతావరణం నెలకొంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.