Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జూన్ 30న సీబీఐ తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన వాంగ్మూలంపై ఏపీ సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం అభ్యంతరం తెలిపారు. సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసిందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
సీబీఐ వాంగ్మూలంలో ఏముందంటే.. లోటస్పాండ్లో ఉండగా ఉదయం 5.30 గంటలకు అటెండర్ తలుపు కొట్టారని అజేయం కల్లాం తెలిపారని సీబీఐ పేర్కొంది. వైఎస్ భారతి మేడపైకి రమ్మంటున్నారని అటెండర్ జగన్కు చెప్పినట్లు పేర్కొన్నారు. బయటకు వెళ్లి 10 నిమిషాల తర్వాత జగన్ మళ్లీ వచ్చారని వివరించారు. బాబాయ్ ఇక లేరనే విషయాన్ని జగన్ నిలబడే చెప్పారంటూ అజేయ కల్లం వాంగ్మూలాన్ని సీబీఐ జూన్ 30న హైకోర్టుకు సమర్పించింది.
తన వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా నమోదు చేసిందని పేర్కొంటూ.. తాజాగా అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ను భారతి పిలిచారని సీబీఐకి తాను చెప్పలేదని స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఛార్జిషీట్ నుంచి తన వాంగ్మూలాన్ని తొలగించాలని కోరారు. తన వాంగ్మూలం విషయంలో మళ్లీ విచారణ జరిపేలా సీబీఐను ఆదేశించాలని పిటిషన్లో అజేయ కల్లం కోరారు.