Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమంలో మరోసారి తొక్కిసలాట జరిగింది. గుంటూరులో నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో అపశ్రుతి చోటు చేసుకుంది. సభ ముగిసి చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలిలో ఓ మహిళ మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గుంటూరు వికాస్నగర్లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 30వేల మందికి ఇవ్వాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. ఆయన కార్యక్రమంలో ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా అందరూ తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. వెనుక ఉన్న వాళ్లు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం చేయడంతో సభకు భారీగా మహిళలు తరలివచ్చారు. కానుకల పంపిణీ సమయంలో అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇద్దరు మృతులను ఏటీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవి, ఆషియాగా గుర్తించారు.
ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్నిరోజుల వ్యవధిలోనే మరో విషాదం చోటుచేసుకోవడంపై అటు టీడీపీపైనా, ఇటు ప్రభుత్వంపైనా విమర్శలు వస్తున్నాయి.