Pemmasani Press meet: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు ఇస్తదని ఎవరూ ఊహించలేదన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చైనా భరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లలోగై పోలవరాన్ని పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు.
ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అంటూ ఏపీకి కొత్త అర్థాన్ని చెప్పుకొచ్చారు. ఈ రెండు నిర్మాణాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని చెప్పారు. కేంద్రం కూడా అందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తదని తెలిపారు. అమరావతికి రూ. 2500 కోట్లతో రైల్వే లైన్ కూడా మంజూరైందన్నారు. రూ. 12 వేల కోట్ల నుంచి రూ. 15 వేల కోట్ల విలువైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకు అవసరమైన భూ సేకరణకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తదన్నారు.
Also Read: బాపట్లలో దైవ దర్శనానికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం
వెనకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను కూడా కలిపి, ఆయా జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తుందన్నారు. రాష్ట్రానికి రెండు మేజర్ పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నట్లు ఆయన చెప్పారు. వివిధ ప్రాజెక్టుల రూపంలో దాదాపు రూ. 80 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు. కేంద్ర పథకాల ద్వారా మరిన్ని నిధులు వస్తాయని పెమ్మసాని పేర్కొన్నారు.