Low Pressure Likely to Form in 2 Days: తెలుగు రాష్ట్రాల్లో గడిచిన నాలుగు రోజుల్లో కురిసిన భారీ వర్షాలు ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తెలంగాణలో గోదావరి, ఆంధ్రాలో కృష్ణానదులు వరదనీటితో ఉరకలు వేస్తున్నాయి. భారీ వర్షాలకు ఇరు రాష్ట్రాల మధ్యనున్న హైవేలు, రోడ్లు దెబ్బతినడంతో వందల సంఖ్యలో బస్సు రద్దయ్యాయి. రైల్వే ట్రాక్ లు ధ్వంసం అవ్వగా.. 400 కుపైగా రైళ్లను రద్దుచేసింది దక్షిణమధ్య రైల్వే.
హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు ముంపుకు గురయ్యాయి. ఇటు ఏపీలో ఎన్టీఆర్ జిల్లా వరదకు గురైంది. ఇప్పటికీ కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి ప్రవాహానికి లంగర్ వేసిన బోట్లు బ్యారేజీ లోని 69వ పిల్లర్ వద్దకు కొట్టుకురావడంతో అది పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. 70 గేట్లను ఎత్తి 11 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
Also Read: పీకల్లోతు కష్టాల్లో బెజవాడ.. 121 ఏళ్లలో ఎన్నడూ చూడని వరద
నాలుగు రోజులుగా భారీ వర్షాలకు కారణమైన వాయుగుండం బలహీన పడి.. ప్రస్తుతం తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు పయనిస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మరో 24 గంటల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా.. వచ్చే రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 72 గంటల్లో పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో సెప్టెంబర్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అయితే పశ్చిమ పసిఫిక్ లో ఏర్పడిన తుపాను ప్రభావం దీనిపై ఉండొచ్చని చెబుతున్నారు. అదే జరిగితే అల్పపీడనం వాయుగుండంగా మారవచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.