తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయానికి సమీపంలో బోనులోకి వచ్చి చిక్కుకుంది. ఆపరేషన్ చిరుతలో భాగంగా ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో ఈ చిరుత కనిపించడంతో అలర్ట్ అయిన అధికారులు దాన్ని బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు. ఈ బోనులోకి వచ్చి చిరుత చిక్కుకుంది.
అలిపిరి నడకదారిలో ఆగస్టు 11న చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు ముందు ఓ బాలుడిపైనా చిరుత దాడి చేసింది. అదృష్టవశాత్తు ఆ పసివాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత అటవీశాఖతో కలిసి టీటీడీ ఆపరేషన్ చిరుతను చేపట్టింది. ఆ తర్వాత ఓ చిరుతను పట్టుకున్నారు. బాలిక మ ఇప్పటికే 4 చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. ఇప్పుడు 5వ చిరుతను బంధించారు.
ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తుల భద్రత విషయంలో రాజీపడబోమన్నారు. బోనులో చిరుత చిక్కిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అటవీశాఖకు చెందిన 300 మంది సిబ్బందిని భక్తుల భద్రతకు వినియోగిస్తున్నామని చెప్పారు. భక్తులకు భరోసా కల్పించేందుకే కర్రలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ విషయంలో విమర్శలు వచ్చినా భక్తుల భద్రత విషయంలో రాజీపడమన్నారు. బోనులో చిక్కిన చిరుతను క్వారంటైన్కు తరలించారు.